సమ్మర్‌లో ఆ సమస్యలు లేకుండా..!

జిడ్డు చర్మం, మొటిమలు, వేడి వల్ల చర్మం పొడిబారడం.. ఇలా సమ్మర్ వస్తోందంటే చాలు.. ఇబ్బంది పెట్టే సమస్యలెన్నో! వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. ఈ క్రమంలో సౌందర్య సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టక తప్పదు.

Published : 04 Mar 2024 21:31 IST

జిడ్డు చర్మం, మొటిమలు, వేడి వల్ల చర్మం పొడిబారడం.. ఇలా సమ్మర్ వస్తోందంటే చాలు.. ఇబ్బంది పెట్టే సమస్యలెన్నో! వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. ఈ క్రమంలో సౌందర్య సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టక తప్పదు.

స్నానానికి ముందు వద్దు..

చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే వాటిలో మృత కణాలు కూడా ఒకటి. వీటివల్ల చర్మం డల్‌గా కనిపిస్తుంది. ఇవి చర్మానికి పోషకాలు అందకుండా చేసి, చెమట గ్రంథుల్ని మూసుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా మొటిమలు, మచ్చలు.. వంటివి ఏర్పడతాయి. అందుకే సౌందర్య సంరక్షణలో భాగంగా వీటిని తొలగించుకోవడం అవసరం. ఇందుకోసం స్నానం చేయడానికి ముందే ఏదైనా ఎసెన్షియల్ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసుకోవాలి. ఆపై స్నానం చేసి.. మీ చర్మతత్వానికి సరిపోయే స్క్రబ్ సహాయంతో మృత కణాలను తొలగించుకోవాలి. ఫలితంగా చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా వాటిని సులభంగా వదిలించుకోవచ్చు.

తేమనందించడం ముఖ్యం..

అవాంఛిత రోమాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం సహజమే. ఇందుకోసం వివిధ రకాల క్రీములు వాడడం, వ్యాక్సింగ్ చేయించుకోవడం.. వంటివి చేస్తుంటారు చాలామంది. అయితే వీటివల్ల చర్మం ఇరిటేట్ అయి ఎరుపెక్కడం, దురద రావడం.. ఇలా పలు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ముందు, తర్వాత ఆ ప్రదేశంలో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం తప్పనిసరి. ఇందుకోసం చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లను ఎంపిక చేసుకోవాలి. వీటిలోని గ్లిజరిన్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు ఎదురవకుండా చేస్తుంది. అలాగే వ్యాక్సింగ్ చేయించుకునే వారు పదే పదే కాకుండా.. వ్యాక్సింగ్‌కి, వ్యాక్సింగ్‌కి మధ్య కనీసం పదిహేను రోజులైనా గ్యాప్ తీసుకోవడం తప్పనిసరి. ఇలా షేవ్ చేసుకున్న వెంటనే పూల్స్, బీచ్‌లలోని నీటిలో ఈతకొట్టడం సరికాదు. దీనివల్ల ఆ నీటిలోని క్లోరిన్, ఉప్పు, సూర్యరశ్మి.. మొదలైనవాటి వల్ల చర్మంపై ట్యాన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 24 గంటల సమయమైనా గ్యాప్ తీసుకోవాలి.

చర్మం మెరుపు కోసం...

మనం తీసుకునే ఆహారం సైతం మేని మెరుపుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే వేసవి కాలంలోనూ చర్మాన్ని తాజాగా మార్చుకోవడానికి, మెరిపించుకోవడానికి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఫలితంగా మచ్చలేని మెరిసే చర్మం సొంతమవుతుంది.

ఇరవై నిమిషాల ముందు..

ఏ కాలమైనా బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఇది ఎండ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. అయితే దీని అవసరం వేసవి కాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయటికి అడుగుపెట్టే ముందు కచ్చితంగా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. అది కూడా బయటికి వెళ్లడానికి కనీసం 20 నిమిషాల ముందే రాసుకోవాలట. అంతేకాదు.. ఇంటికి చేరుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం తప్పనిసరి. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి మాయిశ్చరైజర్ రాసుకోవడమూ మర్చిపోవద్దు. అది కూడా చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్