Putin: పుతిన్‌పై తిరుగుబాటుకు యత్నం.. ఉక్రెయిన్‌ మిలిటరీ జనరల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉక్రెయిన్‌కు చెందిన సైనిక ఉన్నతాధికారి తెలిపారు....

Published : 15 May 2022 13:52 IST

కీవ్‌: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉక్రెయిన్‌కు చెందిన సైనిక ఉన్నతాధికారి తెలిపారు. దాన్ని ఎవరూ ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు యుద్ధం కొనసాగిస్తున్న వేళ ‘స్కై న్యూస్‌’కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో మేజర్‌ జనరల్‌ కిరిలో బుదనోవ్‌ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆగస్టు మధ్యలో యుద్ధం కీలక మలుపు తీసుకొని ఏడాది చివరకు ముగుస్తుందని బుదనోవ్‌ అంచనా వేశారు. ఒకవేళ ఈ యుద్ధంలో రష్యా ఓడిపోతే.. పుతిన్‌ పదవి నుంచి తొలగిపోతారని, ఆ దేశం కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఆయనను గద్దె దింపే ప్రయత్నాలు కొంతమంది ప్రారంభించారని తెలిపారు. వారు ఆ దిశగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పరోక్షంగా పుతిన్‌పై తిరుగుబాటుకు రష్యాలో కొంతమంది యత్నిస్తున్నారని బుదనోవ్‌ చెప్పుకొచ్చారు. పైగా వారిని ఆపడం అసాధ్యమని కూడా అభిప్రాయపడ్డారు.

అలాగే పుతిన్‌ క్యాన్సర్‌ సహా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని బుదనోవ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే, యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్‌పై తప్పుడు ప్రచారాల్లో భాగంగా చేస్తున్న ఆరోపణలుగా వీటిని ఎందుకు భావించకూడదని బుదనోవ్‌ను ప్రశ్నించగా..ఇలాంటి సమాచారం తెలుసుకోవడం తన విధుల్లో భాగమని.. తనకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుందని సమాధానమిచ్చారు. పుతిన్‌ ఆరోగ్యం దెబ్బతిందని ఇప్పటికే పలు మీడియా కథనాలు వెలువడ్డ విషయం తెలిసిందే. రష్యా మాత్రం ఇప్పటి వరకు వీటిపై స్పందించలేదు. 

మరోవైపు ఈ యుద్ధంలో రష్యా తీవ్రంగా నష్టపోతోందని బుదనోవ్‌ తెలిపారు. పుతిన్‌ సేనను చూసి ఐరోపా భయపడుతున్న మాట వాస్తవమన్నారు. కానీ, రష్యా అనుకున్నంత బలమైన దేశం కాదని చెప్పుకొచ్చారు. వారి సైన్యాన్ని ఆయుధాలు కలిగిన జనసమూహంగా అభివర్ణించారు. ఖర్కీవ్‌లో రష్యా సేనలను ఉక్రెయిన్‌ బలగాలు సరిహద్దుల వరకు తరిమికొట్టాయన్నారు. ఇప్పటికే రష్యా అనేక మంది సైనికుల్ని, ఆయుధాల్ని కోల్పోయిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని