రంగంలోకి పెన్స్‌.. ట్రంప్‌తో పోటీకి సై

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి రిపబ్లికన్‌ పార్టీ తరఫున జరుగుతున్న పోరులో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఊహించని పోటీ ఎదుర్కొంటున్నారు.

Published : 09 Jun 2023 05:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి రిపబ్లికన్‌ పార్టీ తరఫున జరుగుతున్న పోరులో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఊహించని పోటీ ఎదుర్కొంటున్నారు. గతంలో ఆయన వద్ద ఉపాధ్యక్షుడిగా పనిచేసిన పెన్స్‌ కూడా 2024 అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వానికి సై అంటున్నారు. ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల కోసం పెన్స్‌ తాజాగా తన ప్రయత్నాలను కూడా ప్రారంభించారు. ఏకంగా ట్రంప్‌ను విమర్శిస్తూనే ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 2021లో ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్స్‌ భవనంపై చేసిన దాడిని తీవ్రంగా విమర్శించారు. ఐయోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పెన్స్‌ మాట్లాడుతూ..‘‘ఎవరైనా రాజ్యాంగం కంటే తాము అధికులమని భావిస్తే.. వారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవకూడదు. అంతేకాదు.. తమను రాజ్యాంగం కన్నా అధికులుగా చూడాలని కోరినవారిని మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నుకోకూడదు’’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వానికి దీంతో పోటీ మొదలైందని చెప్పవచ్చు. పెన్స్‌ వ్యాఖ్యలు ట్రంప్‌ ఏమాత్రం జీర్ణించుకోలేనివిగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు ట్రంప్‌పై విమర్శలకు పెన్స్‌ దూరంగా ఉన్నారు. చాలామంది రిపబ్లికన్‌ ఆశావహులు సైతం క్యాపిటల్‌ హిల్స్‌పై దాడి ఘటనను ప్రస్తావించేందుకు వెనుకాడారు. ట్రంప్‌ శ్వేతసౌధంలో ఉన్నంతకాలం ఆయన చర్యలను, వివాదాలను సమర్థించుకొంటూ వచ్చిన పెన్స్‌.. ఇప్పుడు ధైర్యంగా ముందుకువచ్చి ఇలా మాట్లాడటం గమనార్హం. నాటి ఘటనను రాజకీయ విషపూరితమైన, భయంకర చర్యగా పెన్స్‌ చూశారు. రిపబ్లికన్లలో ట్రంప్‌ వ్యతిరేకులను ఆకర్షించేందుకు పెన్స్‌ వ్యాఖ్యలు బాగా ఉపయోగపడతాయనే అంచనాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని