ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీలో చీలిక

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీలో ముసలం పుట్టింది. ఆయన నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) నుంచి గతంలో వైదొలగిన దాదాపు 100 మంది నాయకులు గురువారం ‘ఇస్తేఖామ్‌ ఏ పాకిస్థాన్‌ పార్టీ’ (ఐపీపీ)ని ప్రారంభించారు.

Published : 09 Jun 2023 05:29 IST

ఇస్తేఖామ్‌ ఏ పాకిస్థాన్‌ పార్టీని ఏర్పాటుచేసిన మాజీ అనుచరులు
సైన్యం అండతో వచ్చే ఎన్నికల్లో పోటీ?

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీలో ముసలం పుట్టింది. ఆయన నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) నుంచి గతంలో వైదొలగిన దాదాపు 100 మంది నాయకులు గురువారం ‘ఇస్తేఖామ్‌ ఏ పాకిస్థాన్‌ పార్టీ’ (ఐపీపీ)ని ప్రారంభించారు. మే 9వ తేదీన ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రాంగణంలో ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు నిరసనగా ఆయన అనుచరులు దేశమంతటా ఆందోళనకు దిగారు. రావల్పిండిలోని పాక్‌ సైనిక ప్రధాన కార్యాలయంతోపాటు 20 సైనిక కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా పలువురు మరణించారు. మే 9న అల్లర్లు జరిగినప్పటి నుంచి పీటీఐ నుంచి పలువురు నాయకులు నిష్క్రమించసాగారు. గురువారం వారు కొత్త పార్టీ ఐపీపీని ప్రారంభించారు. అక్టోబరులో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఐపీపీ పాక్‌ సైన్యం అండతో పోటీ చేస్తుందని అంచనా. 2018లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానమంత్రిగా పీటీఐ ప్రభుత్వం ఏర్పడడానికి సూత్రధారిగా వ్యవహరించిన చక్కెర మిల్లుల యజమాని జహంగీర్‌ ఖాన్‌ తరీన్‌ ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. పీటీఐ ప్రభుత్వ హయాంలోనే తరీన్‌పై అక్రమ నగదు చలామణి కేసు నమోదైంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నందుకు సుప్రీంకోర్టు 2017లో తరీన్‌ జీవితాంతం ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టడానికి వీల్లేదని తీర్మానించింది. తరీన్‌ ఈ అనర్హత వేటు నుంచి తప్పించుకొనేంతవరకు కొత్త పార్టీ ఐపీపీ అధ్యక్ష పదవి చేపట్టాలని పత్రికాధిపతి, స్థిరాస్తి వ్యాపారి అలీం ఖాన్‌ ఉవ్విళ్లూరుతున్నారు. పాక్‌ సైన్యం ఒత్తిడిపై దాదాపు 130 మంది నాయకులు, మాజీ శాసనకర్తలు పీటీఐ నుంచి వైదొలిగారని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. పాక్‌ సైనిక కార్యాలయాలపై పీటీఐ కార్యకర్తల దాడిని నిరసిస్తూ పార్టీ నుంచి వైదొలగామని అసమ్మతి నేతలు చెబుతున్నారు. వారు స్థాపించిన ఐపీపీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సైన్యం అండతో అధికారంలో వాటా పంచుకోవచ్చని అంచనా.

ఇమ్రాన్‌కు ముందస్తు బెయిలు

ఇస్లామాబాద్‌: సీనియర్‌ న్యాయవాది హత్య కేసులో పాక్‌ మాజీ ప్రదాని ఇమ్రాన్‌ ఖాన్‌(70)కు ఇస్లామాబాద్‌ హైకోర్టు గురువారం ముందస్తు బెయిలు ఇచ్చింది. మరో ఎనిమిది కేసుల్లో ఇమ్రాన్‌ బెయిలు పిటిషన్లపై ఉత్తర్వులను వాయిదా వేసింది. బలూచిస్థాన్‌ రాజధాని క్వెట్టాలో గతేడాది జూన్‌ 6న సుప్రీంకోర్టు న్యాయవాది అబ్దుల్‌ రజాక్‌ షార్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. బలూచిస్థాన్‌ హైకోర్టులో ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా కేసు పెట్టినందుకే తన తండ్రి షార్‌ను ఇమ్రాన్‌ హత్య చేయించారని షార్‌ తనయుడు ఆరోపించారు. ఈ హత్యలో పాక్‌ ప్రభుత్వ హస్తం ఉందని ఇమ్రాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) ఆరోపించగా, దీనికి ఇమ్రానే బాధ్యత వహించాలని ప్రభుత్వం ప్రత్యారోపణ చేసింది. ఈ కేసులో ఇమ్రాన్‌కు అరెస్టు నుంచి రెండు వారాలపాటు ముందస్తు బెయిలును న్యాయస్థానం మంజూరు చేసింది. పాకిస్థాన్‌కు విదేశాల నుంచి అందిన బహుమతులను ఇమ్రాన్‌ కైంకర్యం చేశారనే కేసులో కూడా ఆయన బెయిలు కోరుతున్నారు. ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో ఆయనపై మరో 10 కేసులున్నాయి. ఇలా రకరకాల ఆరోపణలతో ఇమ్రాన్‌పై పాక్‌ ప్రభుత్వం దాదాపు 100 కేసులు పెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని