
Omicron: నాలుగో డోసు పొందినా.. ఒమిక్రాన్ నుంచి రక్షణ పాక్షికమే
జెరుసలేం: కొవిడ్-19 టీకా నాలుగో డోసు పొందడం వల్ల యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నప్పటికీ కరోనాలోని ఒమిక్రాన్ వేరియంట్ నుంచి పాక్షిక రక్షణ మాత్రమే లభిస్తోందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. షెబా మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. టీకాల సురక్షితను, సమర్థతను వీరు పరిశీలించారు. పరిశోధనలో భాగంగా షెబా మెడికల్ సెంటర్ సిబ్బందికి రెండో బూస్టర్ టీకా (నాలుగో డోసు) ఇచ్చారు. వీరిలో 154 మందికి ఫైజర్, 120 మందికి మోడెర్నా టీకాలు ఇచ్చారు. ఈ రెండు బృందాల్లోనూ నాలుగో డోసు ఇచ్చిన వారం తర్వాత యాంటీబాడీలు పెరిగాయి. రెండు వారాల తర్వాత పరిశీలించినప్పుడు ఫైజర్ టీకా పొందిన వారిలో యాంటీబాడీల సంఖ్య మరింత పెరిగింది. సురక్షిత అంశానికొస్తే.. ఫైజర్, మోడెర్నా టీకాలు రెండూ ఒకే స్థాయిలో ఉన్నట్లు తేలింది. ‘‘మూడో డోసుతో పోలిస్తే నాలుగో డోసు తర్వాత యాంటీబాడీల స్థాయి స్వల్పంగా పెరిగింది. నాలుగో డోసు వల్ల ఇవి పెరిగినా ఒమిక్రాన్ వేరియంట్ నుంచి పాక్షికంగానే రక్షణ లభిస్తోంది. ఈ రకం వైరస్.. టీకా సామర్థ్యాలను ఒకింత ఏమారుస్తోంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న గిల్లీ రెగెవ్ యోచాయ్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.