అతి నీలలోహిత కిరణాలతో ప్లాస్టిక్ను కరిగించేయొచ్చు
ప్లాస్టిక్ను సురక్షితంగా కరిగించేందుకు బ్రిటన్ పరిశోధకులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. అతి నీలలోహిత (యూవీ) కిరణాలను ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను వారు ఇట్టే కరిగిస్తుండటం విశేషం. ప్రకృతిలో
సరికొత్త విధానాన్ని కనుగొన్న బ్రిటన్ శాస్త్రవేత్తలు
లండన్: ప్లాస్టిక్ను సురక్షితంగా కరిగించేందుకు బ్రిటన్ పరిశోధకులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. అతి నీలలోహిత (యూవీ) కిరణాలను ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను వారు ఇట్టే కరిగిస్తుండటం విశేషం. ప్రకృతిలో త్వరగా కలిసిపోయే (బయోడీగ్రేడబుల్) ప్లాస్టిక్ అని తయారీదారులు పేర్కొంటున్న వస్తువుల్లో పాలీ లాక్టిక్ యాసిడ్ (పీఎల్ఏ) ఉంటుంది. వాడిపారేసే కప్పులు, టీ బ్యాగులు, త్రీడీ ప్రింటింగ్, ప్యాకేజింగ్లోనూ ఈ పదార్థాన్ని విరివిగా వాడతారు. అలాగని ఇవేమీ భూమిలోనూ, సముద్రంలోనూ అంత సులభంగా కరగవు. ఇందుకు ఏళ్లు పడుతుంది. దీంతో పీఎల్ఏతో కూడిన ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను అధిక ఉష్ణోగ్రతతో కూడిన కంపోస్టింగ్ పరిశ్రమల్లో కరిగించాల్సి వస్తోంది. ఈ సమస్యపై యూనివర్సిటీ ఆఫ్ బాత్ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. పీఎల్ఏ పరిమాణంలో 3 శాతానికి సమానమైన షుగర్ పాలిమర్ యూనిట్లను చేర్చి, యూవీ కిరణాల కింద ఆరు గంటలు ఉంచడం ద్వారా... ప్లాస్టిక్ను కరిగించవచ్చని కనుగొన్నారు. ‘‘పీఎల్ఏతో కూడిన ప్లాస్టిక్లో పొడవాటి పాలిమర్ గొలుసులు ఉంటాయి. నీళ్లు, ఎంజైములు వాటిని విచ్ఛిన్నం చేయడం కష్టం. అయితే, షుగర్ను చేర్చిన పాలిమర్ గొలుసులను యూవీ కిరణాలు సమర్థంగా కరిగిస్తాయి’’ అని పరిశోధనకర్త ఆంటోనీ బుచర్డ్ వివరించారు. ప్లాస్టిక్ పరిశ్రమలు ఈ సాంకేతికతను సులభంగానే అందిపుచ్చుకోవచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.