UK visa fee: అక్టోబర్‌ 4 నుంచి యూకే వీసాల ఫీజు పెంపు

UK visa fee: భారత్‌ సహా ప్రపంచ దేశాల పౌరులకు ఇకపై బ్రిటన్‌కు వెళ్లడం భారంగా మారనుంది.

Published : 17 Sep 2023 12:17 IST

లండన్‌: విదేశీయులకు తమ దేశ వీసా ఫీజుల పెంపు అక్టోబర్‌ 4 నుంచి అమల్లోకి వస్తుందని బ్రిటన్‌ ప్రకటించింది. దీంతో ఆరు నెలలు, అంతకంటే తక్కువ వ్యవధిగల పర్యాటక వీసాలపై ఇక నుంచి 15 జీబీపీ (The British pound sterling)లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే విద్యార్థి వీసాల ఫీజు అదనంగా 127 జీబీపీలు పెరుగుతున్నట్లు పేర్కొంది. దీనికి ఇంకా పార్లమెంట్‌ ఆమోదం లభించాల్సి ఉంది. అయితే, ఆ ప్రక్రియ లాంఛనమే. భారత్‌ సహా ప్రపంచ దేశాల పౌరులకు ఇకపై బ్రిటన్‌కు వెళ్లడం భారంగా మారనుంది.

ఈ పెంపు తర్వాత ఆరు నెలల పర్యాటక వీసా ఫీజు 115 జీబీపీలు, విద్యార్థి వీసా ఫీజు 490 జీబీపీలకు చేరనుంది. విదేశీయుల వీసా ఫీజులతోపాటు జాతీయ ఆరోగ్య సేవకు (ఎన్‌హెచ్‌ఎస్‌) వారు చెల్లించే సర్‌ఛార్జిని పెంచుతున్నట్లు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ జులైలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు వేతనాల పెంపు కారణంగా పడే భారాన్ని దీని ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉపాధ్యాయులు, పోలీసులు, జూనియర్‌ డాక్టర్లు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 5 శాతం నుంచి 7 శాతం వరకు వేతనాలను పెంచాలని స్వతంత్ర రివ్యూ కమిటీ సిఫార్సులకు తలొగ్గిన సునాక్‌ ఆ భారాన్ని విదేశీయులపై వేయాలని నిర్ణయించడం గమనార్హం. ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే డబ్బును వేతనాలకు ఖర్చు చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే వీసా ఫీజులను, ఇమ్మిగ్రేషన్‌ హెల్త్‌ సర్‌ఛార్జిని పెంచాలని నిర్ణయించామని సునాక్‌ తెలిపారు. ఈ పెంపుతో బ్రిటన్‌ ఖాజానాకు బిలియన్‌ జీబీపీల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని