Visa: అమెరికాలోనే H-1B వీసా రెన్యువల్‌.. అందుబాటులోకి పైలట్‌ ప్రోగ్రామ్‌

H-1B Visa Renewal: హెచ్‌-1బీ వీసాదారులు అమెరికాలోనే తమ వీసాలను రెన్యువల్‌ చేసుకునేందుకు పైలట్‌ ప్రోగ్రామ్ అందుబాటులోకి వచ్చింది.

Published : 30 Jan 2024 16:22 IST

వాషింగ్టన్‌: హెచ్‌-1బీ వీసా (H-1B visa) రెన్యువల్‌ విధానాన్ని మరింత సరళీకరించేలా అమెరికా (USA) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విదేశీ వృత్తి నిపుణులు తమ హెచ్‌-1బీ వీసాలను అమెరికాలోనే రెన్యువల్‌ (Renewal) చేసుకునేలా ఓ పైలట్‌ ప్రోగ్రామ్‌కు బైడెన్‌ సర్కారు ఇటీవల పచ్చజెండా ఊపింది. తాజాగా ఇది అందుబాటులోకి వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం జనవరి 29 నుంచి ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభమైనట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఇందులోభాగంగా 20వేల వీసాలను అమెరికాలోనే రెన్యువల్‌ చేయనున్నారు. తొలి దశ ఈ అవకాశాన్ని కేవలం భారతీయులు, కెనడియన్లకు మాత్రమే కల్పించారు. ఐదు వారాల పాటు ఈ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంటుంది. ప్రతి వారం 4వేలు చొప్పున వీసాలను రెన్యువల్‌ చేయనున్నారు. 2020 జనవరి 1 నుంచి 2023 ఏప్రిల్‌ 1 మధ్య మిషన్‌ కెనడా జారీ చేసిన వీసాలు, 2021 ఫిబ్రవరి 1 నుంచి 2021 సెప్టెంబరు 30 మధ్య మిషన్‌ ఇండియా జారీ చేసిన వీసాలను మాత్రమే రెన్యువల్‌ చేసుకునేందుకు వీలు కల్పించారు.

14 లక్షల వీసా దరఖాస్తుల పరిష్కారం

అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు హెచ్‌-1బీ వీసా (H-1B visa) అవకాశం కల్పిస్తుంది. ఈ వీసాలను వినియోగిస్తున్న వారిలో భారతీయులే అధికం. సాధారణంగా వీటి గడువు మూడేళ్లలో తీరిపోతుంది. గతంలో హెచ్‌-1బీ వీసా కలిగినవారు రెన్యువల్‌ కోసం అమెరికాను విడిచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. 2004 వరకు ఇదే విధానం అమలయ్యేది. 

ఆ తర్వాత దీనిలో మార్పు చేయడంతో.. రెన్యువల్‌ కోసం స్వదేశం తిరిగిరావడమో లేక మరేదైనా దేశానికి వెళ్లి పునరుద్ధరించుకోవడమో చేయాల్సివస్తోంది. అయితే, గతేడాది జూన్‌లో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చినపుడు హెచ్‌-1బీ వీసాలను అగ్రరాజ్యంలోనే పునరుద్ధరిస్తామని బైడెన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా పైలట్‌ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని