
వార్తలు / కథనాలు
మొబైల్ ఫోన్.. చేతిలో లేకపోతే క్షణం గడవదు. సమయం చూసుకోవడం మొదలు.. సమస్యలకు పరిష్కారం వరకూ అన్నింటికి ఇప్పుడు ఫోన్పైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో మనుషుల మధ్య మాటలు తగ్గిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నా.. జనాల మధ్య ఉన్నా చేతిలో మొబైల్ పెట్టుకొని ప్రపంచాన్ని చూసే యూజర్లు.. తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. మొబైల్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్థాలున్నాయి. అందుకే దాన్ని పరిమితంగా.. ఇతరులకు ఇబ్బంది కలగకుండా.. మనం ఇబ్బందుల్లో పడకుండా వాడాలి. ఈ విషయంలో జపాన్ ప్రజలు ఇతర దేశాల కంటే ముందున్నారు. అక్కడి వారంతా మొబైల్ వాడకంలో కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. వాటిని తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు.
ప్రజా రవాణాలో ఫోన్ మాట్లాడటం నిషేధం
చాలా మంది తమకు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఎక్కడున్నామన్న సంగతి కూడా మర్చిపోయి తెగ మాట్లాడేస్తుంటారు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణిస్తున్నా పక్కవారికి ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని కూడా గుర్తించరు. కానీ, జపాన్లో అలా చేయరు. బస్సు, రైళ్లలో ఎక్కగానే మొబైల్లో సౌండ్ పూర్తిగా తగ్గిస్తారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫోన్ వాడతారు. ఎవరైనా ఫోన్లో మాట్లాడటం కనిపిస్తే వారిని వింతగా చూస్తారట.
వైర్లెస్ డివైజ్లకు నో
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. కొత్త కొత్త వస్తువులు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ విధంగానే స్మార్ట్ మొబైల్స్ యూజర్ల కోసం వైర్లెస్ డివైజ్లు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ను చేతితో తాకకుండా బ్లూటూత్, వైర్లెస్ హెడ్ఫోన్స్తో ఫోన్లో మాట్లాడటం, పాటలు వినడం ఇప్పుడు సర్వసాధారణమైన విషయం. కానీ, ఇప్పటికీ జపాన్ ప్రజలు ఇలాంటి వైర్లెస్ డివైజ్లు వాడటానికి ఇష్టపడట్లేదు. కాల్స్ వస్తే.. మొబైల్ను చేతిలో పట్టుకొని మాట్లాడటం, లేదా ఇయర్ఫోన్స్ పెట్టుకొని మాట్లాడటం చేస్తారు. వెర్లైస్ డివైజ్ల సహాయంతో ఫోన్ మాట్లాడితే.. తమకు తాము మాట్లాడుకునే పిచ్చివాళ్లలా కనిపిస్తామని అక్కడి వాళ్లు భావిస్తారట. అందుకే వాటిని ఉపయోగించేవారు అరుదు.
వినాలంటే హెడ్ఫోన్స్ తప్పనిసరి
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇంట్లో లేదా ప్రయాణిస్తున్నప్పుడు హెడ్ఫోన్స్ పెట్టుకోకుండా మొబైల్లో పాటలు, వీడియోలు ప్లే చేస్తుంటారు. దాని వల్ల పక్కనుండే వారికి ఇబ్బంది కలుగుతుందని కూడా ఆలోచించరు. అయితే జపాన్లో మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లో హెడ్ఫోన్స్ పెట్టుకునే పాటలు వినడం, వీడియోలు చూడటం చేస్తారు. పొరపాటున మొబైల్ ఫోన్కు హెడ్ఫోన్స్ సరిగా కనెక్ట్ కాకుండా శబ్దాలు బయటికి వస్తే.. అపరాధం చేసిన వారిలా బాధపడతారు. పక్కన ఉండే వారికి ఇబ్బంది కలిగినందుకు క్షమాపణ చెబుతారు.
ఆఫీసుల్లో మొబైల్ వాడితే ఒట్టు
జపాన్ ప్రజలు కష్టజీవులన్న విషయం అందరికి తెలిసిందే. పని చేసే సమయంలో ఇతర పనుల కోసం క్షణ కాలం వృథా చేయరు. సమయపాలనను కచ్చితంగా పాటిస్తారు. ఇక ఆఫీసుల్లో అడుగుపెట్టిన తర్వాత ఉద్యోగులు కనీసం తమ మొబైల్ను చూసుకోరు. ఏదైనా అత్యవసర ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి వస్తే బాస్ అనుమతి తీసుకొవాల్సి ఉంటుంది. అయితే కొన్ని సంస్థలు తమ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వస్తువుల ఉపయోగించుకోవడం కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తున్నాయి.
వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం
ఈ కాలంలో సోషల్మీడియా వినియోగం బాగా పెరిగింది. దీంతో యూజర్లు చక్కగా తయారై దిగిన ఫొటోలను తమ ప్రొఫైల్ పిక్చర్స్గా పెట్టుకుంటున్నారు. వ్యక్తిగత విషయాలను ఆన్లైన్లో పంచుకుంటున్నారు. ఈ విషయంలో జపాన్ వాసులు కాస్త జాగ్రత్త పడతారు. అక్కడ చాలా మంది తమ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకునేందుకు విముఖత చూపిస్తారు. అందుకే వారి సోషల్మీడియా ఖాతాల్లో వారి ఫొటోలకు బదులు వారి పిల్లల ఫొటోలు, యానిమేషన్ క్యారెక్టర్ల ఫొటోలు పెడుతుంటారు.
ఇక్కడ మాత్రం పూర్తిగా భిన్నం
మొబైల్ ఫోన్ వాడకంలో ఇంత చక్కటి నిబంధనలు పాటిస్తూ.. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే జపనీయులు రోడ్డుపై నడుస్తున్నప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తారు. నడిచి వెళ్తున్నప్పుడు మొబైల్ఫోన్లో మునిగిపోతారు. నడుస్తూనే మొబైల్లో ఛాటింగ్, బ్రౌజింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చేవాళ్లను కూడా గమనించరు. దీంతో ఒకరినొకరు ఢీకొని ప్రమాదాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. వీటిని నివారించడం కోసం ఏకంగా కొన్ని యాప్స్ మార్కెట్లోకి రావడం గమనార్హం. ఈ యాప్స్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఎదురుగా ఎవరైనా వస్తే తెలిసిపోతుంది. తద్వారా వారిని ఢీకొట్టకుండా పక్కకు తప్పుకొనే అవకాశం ఉంటుంది.
- ఇంటర్నెట్ డెస్క్