ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును సీఎం జగన్‌ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Updated : 03 May 2024 07:10 IST

పుంగనూరు, న్యూస్‌టుడే: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును సీఎం జగన్‌ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు అధికారం చేపట్టేది లేదు.. చట్టాన్ని రద్దు చేసేది లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రస్తుతం పింఛనుదారుల సమస్యలకు చంద్రబాబు బంధువు నిమ్మగడ్డ రమేశ్‌ ఫిర్యాదే కారణమని మంత్రి ఆరోపించారు. ఉదయం ఐదు గంటలకల్లా ఇళ్ల వద్దనే పింఛన్లు అందించే వాలంటీర్లపై రమేశ్‌తో చంద్రబాబే ఫిర్యాదు చేయించారన్నారు. 66 లక్షల మందికి బ్యాంకుల ద్వారా పింఛన్లు ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించారు.


ఆ యాక్ట్‌ అమలు కాకుండా విషప్రచారం చేస్తున్నారు
మంత్రి బొత్స సత్యనారాయణ  

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ విషప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ లాసన్స్‌బే కాలనీలోని వైకాపా ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ చట్టం ఇంకా పరిశీలన దశలోనే ఉండగా.. డాక్యుమెంట్లు ఉంచుకుంటారని ప్రచారం చేస్తున్నారన్నారు. భూ వివాదాలకు చెక్‌పెట్టే విధంగా పటిష్ఠంగా చట్టాన్ని తయారు చేశాకే అమలులోకి తెస్తామన్నారు. ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న చట్టాన్ని రద్దుచేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రం లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అంటే కూటమి సభ్యులే దానిని అంగీకరించడం లేదా అని సందేహం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని