-
తితిదే పరిపాలన భవనం మైదానంలో గోదా కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేంకటేశ్వర స్వామివారు శ్రీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
-
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో జాతీయ రహదారి పక్కన కోడిపందేలు నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున పాల్గొని సందడి చేశారు.
-
సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో భాజపా ఆధ్వర్యంలో పతంగి పండుగ నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హాజరై ఉత్సాహంగా గాలిపటాన్ని ఎగురవేశారు. భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు పాల్గొన్నారు.
-
ఆస్ట్రేలియాలో ఓ పావురం కలకలం రేపుతోంది. గత అక్టోబర్లో యూఎస్లోని ఓరెగాన్లో నిర్వహించిన రేస్ నుంచి అది తప్పిపోయింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా సుమారు 13వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ కపోతం ఆస్ట్రేలియా చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనికి అమెరికా నూతన అధ్యక్షుడి పేరును పోలి ఉండేలా ‘జో’ అనే పేరును పెట్టారు. ఈ పక్షితో ఏదైనా ముప్పు పొంచి ఉంటుందని భావించి.. అంతమొందించే ప్రణాళిక వేస్తున్నారు.
-
జర్మనీలోని ఒరే పర్వతాల దారిలో భారీగా మంచు పేరుకుపోయి ఇలా ఆకట్టుకుంటోంది.
-
తిరుమలలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ఘనంగా పూర్తయ్యాయి. నాద నీరాజన వేదికపై నిర్వహిస్తున్న విష్ణు వైభవ ప్రవచనం, వసంత మండపంలో నిర్వహిస్తున్న విష్ణు బిల్వ పత్రార్చనలను గురువారం ముగించారు.
-
ఈ చిత్రంలోని వారిని చూసి ఏదో పెళ్లికి వెళుతున్న పెద్ద మనుషులనుకుంటున్నారా..! అయితే మీరు పొరబడ్డట్టే. వీరంతా కడప జిల్లా పోలీసులు. ఎస్పీ అన్బురాజన్ ఆదేశంతో పండగ రోజు ఖాకీ వదిలి సంప్రదాయ దుస్తులతో వచ్చారు. దీంతో అక్కడకు వెళ్లిన వారంతా పోలీస్స్టేషన్కే వచ్చామా అని తమను తాము ఒకసారి ప్రశ్నించుకున్నారు.
-
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గోవా రాజ్భవన్లో కుటుంబ సమేతంగా మకర సంక్రాంతి వేడుకలు జరుపుకొన్నారు. విఘ్నేశ్వరాలయంలో గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంక్రాంతి పండగ అందరి జీవితాల్లో నవ్య కాంతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఆయన దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
-
కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిల్లింగ్స్టేషన్ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఆయనే స్వయంగా ఓ కారుకు పెట్రోల్ కొట్టి సందడి చేశారు. అనంతరం డైరీ ఛైర్మన్ రాజేశ్వరరావుతో కలిసి దైనందినిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్రావు, కార్పొరేటర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
-
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మదురైలోని జల్లికట్టు క్రీడా ప్రాంగణానికి వెళ్లారు. కోడె గిత్తలతో యువకులు ప్రదర్శించిన సాహస క్రీడను ఆయన వీక్షించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పొంగళ్లు తయారు చేస్తున్న తమిళనాడుకు చెందిన మహిళలు
-
సిడ్నీ ఫెస్టివల్లో సర్కా సర్కస్ బృందం తరపున విన్యాసాలు ప్రదర్శిస్తున్న కళాకారులు
-
పుదుచ్చేరికి చెందిన పద్మావతి పదేళ్ల క్రితం గుంటూరు జిల్లా కొల్లిపరకి బతుకుదెరువు కోసం వచ్చారు. అప్పటి నుంచి రిక్షా తొక్కుతూ ఒక్కో జిల్లాకి నెలరోజులు చొప్పున ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దారి పొడువునా వృద్ధులు, దివ్యాంగులను ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.
-
ఏటికొప్పాకకు చెందిన ప్రసిద్ధ హస్త కళాకారుడు, జాతీయస్థాయి అవార్డు గ్రహీత శ్రీశైలపు చిన్నయాచారి గుండుసూది తలపై సంక్రాంతి ఎడ్లబండిని తయారు చేసి ప్రతిభ చాటుకున్నారు. పది రోజులపాటు శ్రమించి ఈ అతి సూక్ష్మమైన ఎడ్లబండిని తయారు చేశారు.
-
తెలిమంచు అందాలు కనువిందు చేయాలంటే పల్లెల తలుపు తట్టాల్సిందే..ముఖ్యంగా సంక్రాంతి పండగ వేళ తెల్లవారుజామున కురిసే మంచు బిందువులు పువ్వులు, మొక్కలు, సాలిగూళ్లను పట్టుకుని... అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు తాకి తళుక్కుమనడం చూసి తీరాల్సిన దృశ్యాలు. -ప్రకాశం జిల్లా కనిగిరి
-
సౌర విద్యుత్తుతో నడిచే సైకిల్ను రూపొందించాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్నగర్కు చెందిన బాల శివకుమార్(14). హ్యాండిల్ కుడి చేతి వద్ద ఎక్స్లేటర్ను కూడా ఏర్పాటు చేశారు. సైకిల్పై 10 కి.మీ వరకు వెళ్లవచ్చని దీనికి రూ.5,100 ఖర్చయినట్లు శివకుమార్ తెలిపారు.
-
పర్వదిన వేళల్లో సూక్ష్మ కళాకృతులను తయారుచేసే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొత్తనారాయణపురం (గోకవరం) గ్రామానికి చెందిన చుండూరు పవన్కుమార్ మరో ఆకృతికి రూపమిచ్చారు. భోగి సందర్భంగా కేవలం అంగుళంన్నర పరిమాణంలో పొంగలి కుండను తయారుచేశారు.
-
చిత్రంలో విచిత్రంగా కనిపిస్తున్న కట్టడాన్ని చూసి ఇదేదో బూత్ బంగ్లా అనుకుంటున్నారా? కానేకాదు. ఇది హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థ గ్రౌండ్ ఫ్లోర్. చెట్ల కాండం, ప్రత్యేక రాళ్లు ఉపయోగించి చూపరులను ఆకట్టుకునేలా నిర్మించారు.
-
ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్బండ్పై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆహార వీధిని ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల ఇంటి వంటకాలతో పది స్టాల్స్ ఉన్నాయి. ప్రతి రోజు సాయంత్రం వీటిని తెరుస్తామని నిర్వాహకులు తెలిపారు.
-
ఈ చిత్రంలో మొక్కలను మేస్తున్న మేకలను చూడండి.. ఇది ఎక్కడో కాదు. కామారెడ్డి కలెక్టరేట్కు సమీపంలో ఇందిరాగాంధీ స్టేడియం ఎదుట పాత జాతీయ రహదారి మధ్యలో మొక్కలు నాటి రక్షణ చర్యలు మరిచారు. దీంతో వాటిని మేకలు మేసేశాయి. ఈ చిత్రం ‘న్యూస్టుడే’ కెమెరాకు చిక్కింది.
-
జమ్మూ-కశ్మీర్లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలూ గణనీయంగా పడిపోయాయి. దీంతో దాల్ లేక్ ఘనీభవించింది. అలా గడ్డ కట్టుకుపోయిన సరస్సులో ఉన్న తన పడవను చూసుకుంటున్న యజమాని.
-
విశాఖలోని కాకిరెడ్డిమెట్టలో నివాసముంటున్న ఓ వ్యక్తి నాటుకోళ్లను పెంచుతున్నాడు. అలా, ఆయన వద్ద ఉన్న కోడిగుడ్లలో ఒకటి అతి చిన్నగా, మరొకటి అతి పెద్దగా ఉండడం గమనార్హం.
-
గొర్రె తోక బెత్తెడు అనేది సామెత. కానీ దీనికి భిన్నంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గొర్రె కనిపించింది. దీని తోక మూరెడు ఉంది.
-
పశ్చిమగోదావరి జిల్లా పండితవిల్లూరులో స్థానికులు బుధవారం భోగిమంట వేశారు. కాలిన కట్టె ఒకటి రెండు తలల పాము ఆకృతిని పోలి ఉండటంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు.