
తాజా వార్తలు
‘మేం గెలిస్తే నిజామాబాద్ పేరు మార్చేస్తాం’
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్: నిజామాబాద్ మేయర్ పీఠంపై ఎంఐఎంను కూర్చోబెట్టేందుకు తెరాస ప్రయత్నిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. భాజపా జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పురపాలక ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీలో ఉన్న డివిజన్లలో తెరాస డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ రాజకీయ నిరక్షరాస్యుడిలా మాట్లాడుతున్నారని.. మోదీ, అమిత్ షాలను విమర్శించే అర్హత ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయబోమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ను భాజపా కైవసం చేసుకుంటుందని.. గెలిచిన తర్వాత నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తూ మొదటి తీర్మానం చేయనున్నట్లు ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.