
తాజా వార్తలు
బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం: శివసేన
దిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శివసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘శివసేన పార్టీ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. పార్టీ అధినేత ఉద్ధవ్ఠాక్రేతో చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలో కోల్కతా చేరుకోబోతున్నాం’ అని రౌత్ ట్వీట్లో స్పష్టం చేశారు. ఇప్పటికే బెంగాల్ ఎన్నికలను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో శివసేన ఈ ప్రకటన చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా బెంగాల్ ఎన్నికల్లో శివసేన పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2019 లోక్సభ ఎన్నికల సమయానికి బెంగాల్లో ఆ పార్టీ ఉన్నప్పటికీ.. ఎన్డీయే కూటమిలో భాగంగా ఉంది.
పశ్చిమబెంగాల్లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార టీఎంసీ నుంచి కీలక నాయకుడు సువేందు అధికారి భాజపాలో చేరడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలో దిగనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
ఇదీ చదవండి
రైతుల ఉద్యమం: 19న సుప్రీం కమిటీ భేటీ