
తాజా వార్తలు
పంత్ వచ్చి టీమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు
ఇంటర్నెట్డెస్క్: అసాధారణ ప్రదర్శనతో గబ్బా కోటను భారత్ బద్దలుకొట్టింది. ఆస్ట్రేలియాపై 2-1తో విజయకేతనం ఎగురవేసింది. అయితే బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఈ ఆఖరి టెస్టు టీ20లా తలపించింది. తొలి ఇన్నింగ్స్లో శార్దూల్, సుందర్ హీరోల్లా జట్టును ఆదుకోగా.. రెండో ఇన్నింగ్స్లో పంత్ వీరోచిత పోరాటం చేశాడు. ఇక సిరాజ్ అయిదు వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు. అయితే ఆఖరి టెస్టులో ఆసీస్పై టీమిండియా ఎలాంటి వ్యూహం రచించింది? గబ్బా ముందు భారత ఆటగాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయనే విశేషాలను రవిచంద్రన్ అశ్విన్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ తాజాగా పంచుకున్నారు.
‘‘ఆసీస్ సారథి టిమ్ పైన్.. సినిమాల్లో డైలాగ్స్ చెప్పినట్లుగా మూడో టెస్టులో గబ్బాకి రా.. చూసుకుందాం అని సవాలు విసిరాడు. అదే సమయంలో ఆఖరి టెస్టుకు నేను, బుమ్రా, జడేజా, విహారి దూరమయ్యాం. బౌలింగ్లో అనుభవజ్ఞులు ఎవరూ లేరు. ఆసీస్ బౌలర్లు టెస్టుల్లో వెయ్యి వికెట్లు పైగా తీస్తే.. మన బౌలర్లు 13 వికెట్లు తీశారు. అయినా జట్టుగా పోరాడి విజయం సాధించాం. ప్రపంచ నంబర్ వన్ బౌలర్ కమిన్స్ బౌలింగ్లో శార్దూల్ సిక్సర్తో ఖాతా తెరవడం సూపర్. అంతేగాక లాంగ్ఆన్లో సిక్సర్తో అతడు 50 పరుగులు చేశాడు’’ అని అశ్విన్ తెలిపాడు.
‘‘మరోవైపు సుందర్ కూడా గొప్పగా ఆడాడు. హుక్ షాట్తో సిక్సర్ బాదడం కూడా ఇన్నింగ్స్లో హైలైట్. అయితే పంత్.. జట్టు ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు. ‘తొలుత డ్రా కోసం పోరాడాలి, ఆఖరి పది ఓవర్లలో విజయం కోసం గేర్ను మార్చాలి’ అనేది జట్టు ప్రణాళిక. కానీ పంత్ బ్యాటింగ్కు వచ్చి మ్యాచ్ గమనాన్ని మార్చాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ ప్రదర్శన కీలకం. ఎన్నో ప్రతికూలతల్లో అతడు అయిదు వికెట్లు పడగొట్టాడు. జట్టు మొత్తానికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వాలి’’ అని అన్నాడు.
‘‘సిడ్నీ అద్భుత పోరాటంతో ఆఖరి టెస్టుకు టీమిండియా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. వాళ్ల వైపు అనుభవజ్ఞులు ఉన్నా.. మన జట్టులో యువరక్తం ఉంది. అయితే, తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయాం. ఈ దశలో సుందర్తో కలిసి శార్దూల్ ఇన్నింగ్స్ గొప్పగా నిర్మించాడు. శార్దూల్ బ్యాటింగ్ ఆడిన తీరు అద్భుతం. అతడు ఆడిన కవర్డ్రైవ్స్ సిరీస్లోనే హైలైట్. అందుకే అతడికి అశ్విన్.. ‘శార్దులకర్’ అని నిక్నేమ్ పెట్టాడు. తెందుల్కర్లా అతడు కవర్డ్రైవ్స్ ఆడాడు. ఆసీస్ పేస్ త్రయం కమిన్స్, స్టార్క్, హేజిల్వుడ్ బౌలింగ్లో బౌండరీలు సాధించాడు. సుందర్ కూడా గొప్పగా ఆడాడు’’ అని శ్రీధర్ ప్రశంసించాడు.
ఇదీ చదవండి
అతడి స్థానంలో పంత్కు చోటివ్వండి
టెస్టు ఛాంపియన్షిప్: భారత్ పరిస్థితేంటి?