పిలుస్తోంది ఇంజినీరింగ్ సర్వీస్!

ఇంజినీరింగ్‌ సర్వీసుకు ఎంపికై ఉద్యోగంలో చేరినవారికి సమాజంలో గౌరవంతో పాటు ఉద్యోగ భద్రత లభిస్తుంది. క్రమం తప్పని పదోన్నతులతో వీరు అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగ సంతృప్తి ఉంటుంది. ఏడో పే కమీషన్‌తో మొదటి నెల జీతం రూ. 75,000కు పైగా ఉంటుంది....

Updated : 12 Apr 2021 01:28 IST

జనరల్‌ స్టడీస్‌ అంటే హిస్టరీ, జాగ్రఫీ లాంటివి కాకుండా ఇంజినీరింగ్‌ సంబంధిత అంశాలుంటాయి. దీన్నో భూతంలా చూడవలసిన అవసరం లేదు. మ్యాథ్స్‌, ఆప్టిట్యూడ్‌, కరెంట్‌ అఫైర్స్‌లతో పాటు అభ్యర్థులు తమకు సంబంధించిన విభాగంలో పట్టు పెంచుకుంటే కనీస మార్కులు సాధించడం సులభమే.  

ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ) ప్రకటన వెలువడింది. మూడంచెల్లో యూపీఎస్‌సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. దీని ద్వారా కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో 215 ఖాళీలు పూర్తి చేస్తారు. దీనికి ఎలా సంసిద్ధం కావాలో తెలుసుకుందాం!

ఇంజినీరింగ్‌ సర్వీసుకు ఎంపికై ఉద్యోగంలో చేరినవారికి సమాజంలో గౌరవంతో పాటు ఉద్యోగ భద్రత లభిస్తుంది. క్రమం తప్పని పదోన్నతులతో వీరు అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగ సంతృప్తి ఉంటుంది. ఏడో పే కమీషన్‌తో మొదటి నెల జీతం రూ. 75,000కు పైగా ఉంటుంది.  
జాతీయస్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ లాంటి గ్రూప్‌-ఎ ఉద్యోగాల భర్తీ కోసం సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో ఏటా ఈఎస్‌ఈని నిర్వహిస్తారు. తుది ఎంపిక తర్వాత సెంట్రల్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, మిలిటరీ ఇంజినీరింగ్‌, సెంట్రల్‌ వాటర్‌ ఇంజినీరింగ్‌, సెంట్రల్‌ పవర్‌, నేవల్‌, బార్డర్‌ రోడ్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, సర్వే ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌, ఇండియన్‌ టెలికాం సర్వీసెస్‌, జూనియర్‌ టెలికాం ఆఫీసర్‌ లాంటి విభాగాల్లో నియామకాలు జరుగుతాయి.


ప్రశ్నల స్థాయి?  

* ఈఎస్‌ఈ సిలబస్‌ పరిధి విశాలంగా ఉన్నప్పటికీ ప్రశ్నల స్థాయి మాత్రం మధ్యస్థం నుంచి కొంత కఠినంగా ఉంటాయి. కొద్ది సంవత్సరాలుగా ఆచరణాత్మకమైన  ప్రశ్నలు అడుగుతున్నారు.

* సిలబస్‌ను పరిశీలించి అందులోని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సిలబస్‌ను బట్టి ఏ అంశాలలో బలంగా ఉన్నామో, ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ ప్రణాళికను రూపొందించుకోవాలి.

* సాధారణంగా అభ్యర్థులు తమకు నచ్చిన అధ్యాయాలను చదవడానికి సుముఖతతో ఉంటారు. కానీ ఈ పరీక్షలో వెయిటేజిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మార్కులుండే అధ్యాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం.

* అభ్యర్థులు సబ్జెక్ట్‌ పరంగా తమ స్టాయిని బట్టి సొంతంగా ప్రిపేర్‌ కావాలా, కోచింగ్‌లో చేరాలా అనేది నిర్ణయించుకోవాలి.

* సమయపాలన చాలా ప్రధానం. ఏ రోజు నిర్దేశించుకున్న అంశాలను ఆరోజే క్రమశిక్షణతో చదవటం పూర్తి చేయాలి.

* ఎన్‌టీపీఎల్‌ పాఠాలు విద్యార్థులకు ప్రాథ]మిక అంశాల అవగాహనకు బాగా ఉపయోగపడతాయి. అలాగే విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ఉపయోగపడతాయి.


ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ 2021 పరీక్ష విధానం

స్టేజ్‌-1 (ప్రిలిమినరీ): 500 మార్కులు
ది పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. ఇది అర్హత దశ మాత్రమే కాదు. ఇందులో సాధించిన మార్కులు తుది సెలక్షన్‌లో లెక్కిస్తారు.  

స్టేజ్‌ 2 (మెయిన్స్‌) కన్వెన్షనల్‌: 600 మార్కులు
ప్రిలిమినరీ పరీక్ష ద్వారా 1:6 లేదా 1:7 నిష్పత్తిలో మెయిన్స్‌కు అర్హత ఇస్తారు. ఈ సంవత్సరం మొత్తం ఖాళీల సంఖ్య 215 ఉన్నాయి. అంటే 1290 నుంచి 1505 మంది మాత్రమే మెయిన్స్‌ పరీక్ష రాయడానికి అర్హులు అవుతారు.

* కన్వెన్షనల్‌ ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఉంటాయి. అందుకని చదవడంతో పాటు రాయడం బాగా అలవాటు చేసుకోవాలి.
స్టేజ్‌ 3: మౌఖిక పరీక్ష: 200 మార్కులు  
* పైరెండు స్టేజ్‌లలో సాధించిన మార్కుల ఆధారంగా (1100 మార్కులు) అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో స్టేజ్‌-3 పరీక్షకు (ఇంటర్వ్యూ) అనుమతిస్తారు.  

* తుది ఎంపిక మూడు స్టేజ్‌లలో కలిపి 1300 మార్కులకుగాను వచ్చిన మార్కుల ఆధారంగా, ఉన్న ఖాళీల అనుగుణంగా జాబితాను రూపొందిస్తారు.

* ఆన్‌లైన్‌లోదరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 27 ఏప్రిల్‌, 2021.  
* తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌): హైదరాబాద్‌, విశాఖపట్నం.
* వెబ్‌సైట్‌: ‌
www.upsconline.nic.in

- ప్రొ. వై.వి. గోపాలకృష్ణమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని