జాగ్రఫీ కోణంలో వర్తమాన అంశాలు

పోటీ పరీక్షల్లో వచ్చే జనరల్‌ స్టడీస్‌లో భౌగోళిక  వ్యవస్థ (జాగ్రఫీ)కు మార్కుల పరంగా ప్రాధాన్యం ఉంది. అయితే దీనిపై విద్యార్థుల్లో కొన్ని అపోహలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిని తొలగించుకుని 

Updated : 20 Apr 2022 05:05 IST

పోటీ పరీక్షల్లో వచ్చే జనరల్‌ స్టడీస్‌లో భౌగోళిక  వ్యవస్థ (జాగ్రఫీ)కు మార్కుల పరంగా ప్రాధాన్యం ఉంది. అయితే దీనిపై విద్యార్థుల్లో కొన్ని అపోహలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిని తొలగించుకుని ఈ విభాగంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కృషి చేయాలి!

జనరల్‌ స్టడీస్‌: భౌగోళిక వ్యవస్థ 

ప్రపంచ భూగోళ అంశాలు సిలబస్‌లో ఉన్నట్లయితే ప్రధానంగా సౌరకుటుంబంపై అధిక ప్రశ్నలు వస్తాయి. పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాలుగా బోధిస్తున్న అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల సౌర కుటుంబాన్ని పాఠశాల స్థాయిలో చదవటం ద్వారా ఈ విభాగంపై పట్టు సాధించవచ్చు. చదివేటప్పుడు జనరల్‌ నాలెడ్జ్‌ కూడా కొంత అనుసంధానమవుతుంది కాబట్టి అభ్యర్థులకు సౌకర్యం.  

ప్రపంచంలో పొడవైన నది ఏది? లోతైన అఖాతం? జనాభా రీత్యా చిన్న దేశం ఏది? రబ్బర్‌ అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? సూర్యునికి అతి దూరంగా ఉన్న గ్రహం?-  ఇలాంటి ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జ్‌లో కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్‌ యుద్ధ సందర్భంగా ఐరోపా ఖండం మీద ప్రశ్నలు రావచ్చు. ఇది ఒక సందర్భంగా వచ్చే అంశమే గానీ ప్రతిసారీ ఐరోపా ఖండం గురించి చదవమని కాదు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వర్తమాన అంశాలు ఏవైనా జాగ్రఫీ కోణంలో కూడా అడగవచ్చు. అభ్యర్థులు వర్తమానాంశాలు సిద్ధమయ్యేటప్పుడు ఏ అంశాలు ప్రపంచ భౌగోళిక అంశాల కింద అడిగే అవకాశం ఉందో ఆలోచించి చదవటం మంచిది.

ప్రాంతీయ భౌగోళిక అంశాలు

ప్రాంతీయ భౌగోళిక అంశాలపై ప్రశ్నలు జనరల్‌ స్టడీస్‌లో అడిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు తమ తమ రాష్ట్రాల భౌగోళిక అంశాలను భారతదేశ భౌగోళిక అంశాల క్రమంలోనే చదవాల్సి ఉంటుంది. అంటే... భౌతిక, ఆర్థిక, మానవ భౌగోళిక అంశాలు. భారతదేశ కోణంలో చెప్పినట్లుగానే ఆ మూడు విభాగాల్లోనూ అంతర్భాగాలుగా అవే విషయాల్ని రాష్ట్ర పరిధిలో చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోనూ కొత్త జిల్లాల ఆధారంగా భౌతిక, ఆర్థిక, భౌగోళిక అంశాలను అధ్యయనం చేయాలి. జిల్లాల మధ్య వివిధ అంశాల పోలికలు చూసుకోవాలి. ఖనిజాలు, పంటలు, అటవీ ఉత్పత్తులు మొదలైనవి జిల్లాల వారీగా పోల్చుకుని చదవటం మంచిది.

అపోహలు

1. జాగ్రఫీ చాలా కష్టం. ఎంత చదివినా అర్థం కాదు.

ఏ మాత్రం నిజం కాదు. సరైన పద్ధతిలో చదివితే మంచి స్కోరింగ్‌ విభాగమిది. అందుకే సివిల్స్‌ పరీక్షల్లో జాగ్రఫీని ఆప్షనల్‌గా ఎంచుకుంటారు.

2. చాలా పుస్తకాల్లో ఉన్న సైద్ధాంతిక అంశాలు చూస్తే భయమేస్తుంది.

జనరల్‌ స్టడీస్‌లో సైద్ధాంతిక అంశాలపై ప్రశ్నలు దాదాపుగా రావు. అనవసర భయం అక్కర్లేదు.

3. గణాంకాలు చాలా ఎక్కువ.

గణాంకాలు ఎక్కువే గాని ప్రతి చిన్న విషయాన్నీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయకూడదు. ముఖ్యమైన గణాంకాలు దృష్టిలో పెట్టుకుంటే చాలు.

4. సైన్స్‌ అభ్యర్థులకు పెద్దగా అర్థమయ్యే సబ్జెక్టు కాదు.

సరైన విధానంలో అర్థం చేసుకుంటే సైన్స్‌ అభ్యర్థులకైనా, ఆర్ట్స్‌ అభ్యర్థులకైనా ఒకే స్థాయిలో ఉంటుంది.

5. ప్రశ్నలు లోతుగా అడుగుతున్నారు.

మనకు తగిన పరిజ్ఞానం లేనప్పుడు ఏ ప్రశ్న అయినా లోతుగానే కనిపిస్తుంది. పాఠశాల స్థాయి పుస్తకాలు పూర్తి చేసిన తర్వాత ప్రశ్నలు సాధించి చూడండి. ‘లోతైన ప్రశ్నల సంఖ్య నామమాత్రమే’ అని అర్థమవుతుంది.

చదవాల్సిన పుస్తకాలు

* పాఠశాల స్థాయి NCERT, SCERT  పుస్తకాలు

* ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతీయ భూగోళ శాస్త్రం- తెలుగు అకాడమీ

* తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం- తెలుగు అకాడమీ

* భారతదేశ ప్రాంతీయ భూగోళ శాస్త్రం-బి.ఎ. మూడో సంవత్సరం, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం- తెలుగు అకాడమీ 

* ప్రపంచ భూగోళ శాస్త్రం - తెలుగు అకాడమీ

* ఇంగ్లిష్‌ మీడియం అభ్యర్థులు ఏదైనా సివిల్‌ సర్వీస్‌ గైడ్‌ తీసుకుంటే సరిపోతుంది. తెలుగు అకాడమీ ప్రాంతీయ భూగోళశాస్త్ర పుస్తకాలు ఇంగ్లిష్‌ మీడియంలో కూడా లభ్యమవుతున్నాయి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని