సైన్స్లో సత్తా చాటాలని ఉందా?
ప్రామాణిక పరిశోధనలకు సీఎస్ఐఆర్ నెట్
ప్రగతికి మూలం... విజ్ఞానశాస్త్ర పరిశోధనలే. ఇందులో భాగం కావాలనుకున్నవారు జాతీయ స్థాయిలో పేరున్న విద్యాసంస్థలో సీటు పొందాలి. ఎన్టీఏ నిర్వహించే సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఇందుకు అత్యుత్తమ వేదిక. ఈ పరీక్షలో అర్హత పొందితే స్టైపెండ్తో కూడిన పరిశోధనల దిశగా అడుగులేయవచ్చు. భవిష్యత్తు శాస్త్రవేత్తగా అవతరించవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకూ పోటీ పడవచ్చు. ఇటీవలే ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు...
ఏడాదికి రెండుసార్లు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) - యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తరఫున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్) నిర్వహిస్తున్నారు. సీఎస్ఐఆర్కు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రయోగశాలలున్నాయి. వీటిలో పరిశోధనలు కొనసాగించుకునే అవకాశం జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)తో లభిస్తుంది. సైన్స్, ఇంజినీరింగ్లో నాలుగేళ్ల యూజీ కోర్సులు లేదా పీజీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం చదువుతున్నవాళ్లు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏ సబ్జెక్టులు?
* కెమికల్ సైన్సెస్ * ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానిటరీ సైన్సెస్ * లైఫ్ సైన్సెస్ * మేథమెటికల్ సైన్సెస్ * ఫిజికల్ సైన్సెస్
అభ్యర్థులు చదువుకున్న కోర్సు ప్రకారం వీటిలో ఏదో ఒక సబ్జెక్టులో పరీక్ష రాయాలి. నాలుగేళ్ల యూజీ కోర్సులైన బీఈ, బీఎస్, బీఫార్మసీ...మొదలైనవి చదువుకున్నవారికి జేఆర్ఎఫ్ అవకాశం ఉంది. అయితే వీరు లెక్చరర్షిప్నకు అనర్హులు.
పరీక్ష విధానం
అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 200 మార్కులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో మూడు విభాగాలు (ఎ, బి, సి) ఉంటాయి.
* పార్ట్ ఎ: అన్ని విభాగాల వారికీ ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్లో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ మొదలైన అంశాల్లో 20 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. ఈ విభాగానికి 30 మార్కులు. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు.
* పార్ట్ బి: ఈ విభాగంలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆ సబ్జెక్టు ప్రకారం ప్రశ్నల సంఖ్య మారుతుంది. సబ్జెక్టుల్లో 25 నుంచి 50 వరకు ప్రశ్నలు ఉంటాయి. చాయిస్ ఉంది. ఈ విభాగానికి ఆ సబ్జెక్టు ప్రకారం 70 లేదా 75 మార్కులు ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు వంతు చొప్పున తగ్గిస్తారు.
* పార్ట్ సి: ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 30 నుంచి 80 వరకు ప్రశ్నలు వస్తాయి. చాయిస్ ఉంది. మ్యాథ్స్లో 95 మిగిలిన సబ్జెక్టుల్లో వంద మార్కులకు ఈ ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్ తప్ప మిగిలిన వాటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు వంతు చొప్పున తగ్గిస్తారు. సైంటిఫిక్ కాన్సెప్టులపై అభ్యర్థికి ఉన్న అవగాహన, పరిజ్ఞానం, అనువర్తిత ధోరణి మొదలైన అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలన్నీ అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి.
మొత్తం ప్రశ్నపత్రం నుంచి సబ్జెక్టులవారీ.. ఫిజికల్ సైన్సెస్లో 75 ప్రశ్నలకు 55, మ్యాథమెటికల్ సైన్సెస్లో 120కి 60, లైఫ్ సైన్సెస్లో 145కి 75, కెమికల్ సైన్సెస్లో 120కి 75, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్లో 150కి 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. సిలబస్, మాదిరి ప్రశ్నపత్రాలను https://www.csirhrdg.res.in/ నుంచి పొందవచ్చు.
ఏ అంశాలు ముఖ్యం?
* లైఫ్ సైన్సెస్: బోటనీ లేదా జువాలజీలో పీజీ పూర్తిచేసుకున్నవాళ్లు ఆధునిక బయాలజీ (మాలిక్యులార్ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమికల్ టెక్నిక్స్, బయోఫిజిక్స్, స్పెక్ట్రోస్కోపి) పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆధునిక బయాలజీలో పీజీ చేసినవారు క్లాసికల్ బయాలజీ, ఎకాలజీ, ఎవల్యూషన్, బయోడైవర్సిటీపై ఎక్కువ దృష్టి సారించాలి.
* కెమికల్ సైన్సెస్: ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. రియాక్షన్ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీలో ఎసెమిట్రిక్ సింథసిస్, కన్ఫర్మేషనల్ అనాలిసిస్, ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ, రియేజెంట్స్, పెరిసైక్లిక్ చర్యలు, కాంతి రసాయనశాస్త్రం తదితర అంశాలనూ, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. సంశ్లిష్ట సమ్మేళనాలు, అనలిటికల్ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, కర్బన లోహ సమ్మేళనాలు, మెటల్ క్లస్టర్స్ మొదలైన అంశాలనూ అనువర్తిత ధోరణిలో విశ్లేషణాత్మకంగా చదవాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో.. క్వాంటమ్ కెమిస్ట్రీ, సాలిడ్స్టేట్, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ మొదలైన అంశాలను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.
* ఫిజికల్ సైన్సెస్: మోడరన్ ఫిజిక్స్, న్యూక్లియర్, పార్టికల్ ఫిజిక్స్, హీట్, థర్మోడైనమిక్స్ (క్లాసికల్, స్టాటిస్టికల్), ఎలక్ట్రోమాగ్నటిక్ థియరీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎక్స్పరిమెంటల్ మెథడ్స్, ఆప్టిక్స్, మెకానిక్స్ విభాగాలను క్షుణ్నంగా చదవాలి.
* మేథమెటికల్ సైన్సెస్: స్టాటిస్టిక్స్, ఎక్స్పోలేటరీ డేటా అనాలిసిస్, కాంప్లెక్స్, డిఫరెన్షియల్ అనాలిసిస్, మ్యాట్రిక్స్, డెరివేటివ్స్, వెక్టర్, త్రికోణమితి, జామెట్రీ పాఠ్యాంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
* ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానిటరీ సైన్సెస్: భూమి, సౌరవ్యవస్థ, సముద్రాలు, వాతావరణం, పర్యావరణం, భూగర్భశాస్త్రం, జియో కెమిస్ట్రీ, ఎకనామిక్ జియాలజీ, ఫిజికల్ జాగ్రఫీ, జియో ఫిజిక్స్, మెటీరియాలజీ, ఓషన్ సైన్స్ అంశాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి.
ప్రయోజనాలు
జేఆర్ఎఫ్కు ఎంపికై, పరిశోధనల్లో చేరినవారికి తొలి రెండేళ్లు ప్రతి నెలా రూ.31,000 స్టైపెండ్ ఇస్తారు. అనంతరం ఎస్ఆర్ఎఫ్ అర్హత సాధించినవారికి ప్రతి నెలాË రూ.35,000 చొప్పున అందుతుంది. దీంతోపాటు ఉచిత వసతి లేదా స్టైపెండ్లో 30 శాతం హెచ్ఆర్ఏ కింద అదనంగా చెల్లిస్తారు.
నెట్ లెక్చరర్షిప్నకు అర్హత పొందినవారు, జేఆర్ఎఫ్కు ఎంపికైనవాళ్లు.. విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే వీరు డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనించండి!
అర్హత: ఎంఎస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ లేదా బీఈ/ బీటెక్ లేదా నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఫార్మసీ తదితర కోర్సుల్లో 55% మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్, ఓబీసీలు, 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జండర్, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ అర్హులే.
వయసు: జేఆర్ఎఫ్కు గరిష్ఠ వయసు పరిమితి జులై 1, 2022 నాటికి 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, దివ్యాంగులు, మహిళలకు ఐదేళ్లు, నాన్ క్రీమిలేయర్ ఓబీసీలకు మూడేళ్లు మినహాయింపు వర్తిస్తుంది. లెక్చరర్షిప్ (ఎల్ఎస్)కు ఏ వయసువారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తులు: ఏప్రిల్ 10 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.1100, ఓబీసీ- నాన్ క్రీమీలేయర్కు రూ.550, ఎస్సీ/ ఎస్టీ/ థర్డ్ జండర్లకు రూ.275. దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
పరీక్షలు: జూన్ 6,7,8 తేదీల్లో.
పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్.
వెబ్సైట్: https://csirnet.nta.nic.in/
సన్నద్ధత ఎలా?
1 ఈ పరీక్షలో విజయానికి ప్రాథమికాంశాలపై పట్టుతోపాటు సబ్జెక్టుపై లోతైన అవగాహన ఉండాలి. ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా చదివితేనే జవాబు గుర్తించగలం. ఎక్కువ ప్రశ్నలు నేరుగా కాకుండా రెండుమూడు అంశాలపై ముడిపడి ఉంటాయి. అలాగే కొన్ని అనువర్తనానికి సంబంధించీ ఉంటాయి. అందువల్ల మొత్తం సిలబస్ శ్రద్ధగా చదవడం తప్పనిసరి.
2 సబ్జెక్టులవారీ సిలబస్ వివరాలు ఇచ్చారు. వాటిని గమనించాలి. సన్నద్ధతను దీనికి అనుగుణంగా కొనసాగించాలి.
3 తేలిక, మధ్యస్థం, కఠినం... ఇలా సిలబస్ను విడదీయాలి. కఠినమైన అంశాలకు ఎక్కువ సమయం వెచ్చించాలి. కాస్త ఫర్వాలేదు అనిపించినవాటిని మరోసారి రివిజన్ చేసుకోవాలి.
4 పాత ప్రశ్నపత్రాలను సునిశితంగా పరిశీలించాలి. ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, వాటిని ఏ స్థాయిలో చదవాలో తెలుసుకుని, అమలు చేయాలి.
5 సంబంధిత సబ్జెక్టులో ప్రాథమికాంశాలపై పట్టుకోసం సబ్జెక్టుకు చెందిన యూజీ పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. ఆ తర్వాత అనువర్తన, పరిశోధన కోణంలో సన్నద్ధత కొనసాగించాలి.
6 చాప్టర్లవారీగా పీజీ స్థాయిలో రిఫరెన్స్ పుస్తకాలు లోతుగా అధ్యయనం చేయడం తప్పనిసరి.
7 అన్ని సబ్జెక్టుల్లోనూ పార్ట్ సి విభాగానికి ఎక్కువ వెయిటేజీ ఉంది. ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలు, పరిశోధన జర్నల్్్సను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.
8 సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పది మాక్ పరీక్షలు రాసి, ఫలితాలు విశ్లేషించుకోవాలి. బలహీనంగా ఉన్న అంశాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇలా ప్రతి పరీక్ష తర్వాత సమీక్షించుకుని, సన్నద్ధతను మెరుగుపరచుకోవాలి. పరీక్ష రాస్తున్నప్పుడు సమయానికీ ప్రాధాన్యమివ్వాలి.
9 రుణాత్మక మార్కులున్నాయి. కాబట్టి తెలియని ప్రశ్నలను వదిలేయడమే మంచిది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్ను పంచుకున్న సముద్రఖని