NEET merit list: నీట్ ‘మెరిట్ లిస్ట్’లో మార్పులు.. ఇకపై ‘ఫిజిక్స్’ మార్కులకు ప్రాధాన్యం
NEET merit list: నీట్లో ఇకపై ఒకే విధమైన స్కోరు సాధించిన విద్యార్థులకు ఫిజిక్స్ మార్కుల ఆధారంగా ర్యాంక్ను కేటాయించాలని జాతీయ వైద్య మండలి నిర్ణయించింది.
దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష ఫలితాల్లో మెరిట్ లిస్ట్ (NEET merit list)ను నిర్ణయించే ప్రక్రియలో మార్పులు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిర్ణయించింది. ఒకే స్కోరు వచ్చిన అభ్యర్థులకు ర్యాంక్లు కేటాయించడంలో ఇకపై ఫిజిక్స్ (Physics) మార్కులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బయాలజీ (Biology) మార్కులకు ప్రాధాన్యమిస్తుండగా ఇకపై ఆ నిబంధనను సవరించాలని నిర్ణయించింది.
ఈ మేరకు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ -2023ను జాతీయ వైద్య మండలి ఇటీవల విడుదల చేసింది. ఒకవేళ, సబ్జెక్టుల మార్కులు కూడా ఒకే విధంగా ఉంటే.. అప్పుడు కంప్యూటర్ ఆధారిత డ్రా ద్వారా మెరిట్ లిస్ట్ను తయారు చేయనున్నట్లు ఎన్ఎంసీ తెలిపింది. ఇందులో మానవ ప్రమేయం ఏమీ ఉండదని తెలిపింది. ఈ కొత్త రెగ్యులేషన్స్ను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనిపై జాతీయ వైద్య మండలి (NMC), జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలోనే మరింత వివరణ ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
నీట్ - యూజీ (NEET-UG) పరీక్షకు హాజరైన విద్యార్థులు ఒకే స్కోరు/మార్కులు సాధించినప్పుడు ‘టై’ అవుతుంది. నిబంధనల ప్రకారం.. అలాంటి సమయాల్లో ర్యాంకులను కేటాయించేందుకు టై-బ్రేకర్ రూల్ను పాటిస్తారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. ఇలా టై అయినప్పుడు బయాలజీ మార్కులను చూస్తారు. అందులో ఎవరికి ఎక్కువ వస్తే వారికి ర్యాంక్ (Merit List) కేటాయిస్తారు. తక్కువ వచ్చిన వారికి ఆ తర్వాతి ర్యాంక్ ఇస్తారు. బయాలజీలోనూ ఒకే మార్కులు ఉంటే కెమిస్ట్రీ, ఆ తర్వాత ఫిజిక్స్ మార్కులు చూసి ర్యాంకులను కేటాయిస్తున్నారు. సబ్జెక్టుల్లోనూ టై ఉంటే.. అభ్యర్థి వయసు బట్టి.. పెద్దవారికి మొదట ర్యాంక్ కేటాయిస్తారు.
అయితే, ఈ టై బ్రేకింగ్ రూల్స్ను మార్చాలని జాతీయ వైద్య మండలి తాజాగా నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం.. విద్యార్థుల స్కోరు సమానమైనప్పుడు.. తొలుత ఫిజిక్స్లో వచ్చిన మార్పుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. అవి కూడా సమానంగా ఉంటే కెమిస్ట్రీ, ఆ తర్వాత బయాలజీ మార్కులను పరిగణిస్తారు. అప్పటికీ టై వీడకపోతే.. కంప్యూటర్తో డ్రా తీసి ర్యాంకును కేటాయించాలని నిర్ణయించింది. ఈ కంప్యూటర్ డ్రాలో మానవ జోక్యం ఉండదని ఎన్ఎంసీ అధికారులు చెబుతున్నారు.
9 ఏళ్లలో పూర్తి చేయాలి..
మెరిట్ జాబితాతో పాటు మరికొన్ని నిబంధనల్లోనూ మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఎంబీబీఎస్ కోర్సులో చేరిన విద్యార్థులు తమ అడ్మిషన్ తేదీ నుంచి 9 ఏళ్లలో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక, ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించేందుకు నాలుగు ప్రయత్నాలను మాత్రమే ఇచ్చింది. అంతేగాక, నీట్-యూజీ మెరిట్ లిస్ట్ ఆధారంగా దేశంలోని అన్ని మెడికల్ ఇనిస్టిట్యూట్లలో గ్రాడ్యుయేషన్ కోర్సుల ప్రవేశాల కోసం కామన్ కౌన్సెలింగ్ ఉంటుందని ఎన్ఎంసీ తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.