కాల్వలున్నా.. రైల్వే గేట్లున్నా.. దాటి రావాల్సిందే!

రైల్వే గేట్లు, కాల్వలు, జాతీయ రహదారులను దాటి వెళ్లాల్సి ఉన్నా 3, 4, 5 తరగతుల విలీనానికి అడ్డంకి కాదని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అధికారిక రైల్వేగేట్లు, వంతెనలు ఉన్న కాల్వలు, జాతీయ రహదారులను పిల్లలు

Published : 21 Jan 2022 03:10 IST

విద్యార్థుల రాకకు  అవేవీ అడ్డంకాదు
హైస్కూళ్లలో 3, 4, 5 తరగతుల విలీనంపై విద్యాశాఖ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: రైల్వే గేట్లు, కాల్వలు, జాతీయ రహదారులను దాటి వెళ్లాల్సి ఉన్నా 3, 4, 5 తరగతుల విలీనానికి అడ్డంకి కాదని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అధికారిక రైల్వేగేట్లు, వంతెనలు ఉన్న కాల్వలు, జాతీయ రహదారులను పిల్లలు వెళ్లేందుకు అవరోధాలుగా పరిగణించొద్దని ఆదేశించింది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై ప్రధానోపాధ్యాయుల సందేహాలకు సమాధానాలిచ్చింది. జాతీయ రహదారులపై జీబ్రా క్రాసింగ్‌లు ఉంటాయని, పాఠశాలల ఆయాలు రోడ్డు దాటిస్తారని.. ఇది విలీనానికి అడ్డంకి కాదని పేర్కొంది.

ప్రాథమిక పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఒకే ఉన్నత పాఠశాల ఉంటే వెయ్యి మంది విద్యార్థులున్నా 3,4,5 తరగతులను విలీనం చేయాల్సిందే.

మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల లేకపోతేనే ప్రాథమికోన్నత బడిలో 3,4,5 తరగతులను విలీనం చేయాలి.

ఒక ప్రాథమిక పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో రెండు, మూడు ఉన్నత పాఠశాలలు ఉంటే మౌలికసదుపాయాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, దూరాన్ని ప్రామాణికంగా తీసుకొని మ్యాపింగ్‌ చేయాలి.

సమీపంలో బాలికల ఉన్నత పాఠశాల ఉంటే ఎనిమిదో తరగతి వరకు బాలురును అందులో విలీనం చేస్తారు.

పాఠశాలలు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే ఎనిమిదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.వెయ్యి చొప్పున సమగ్ర శిక్ష అభియాన్‌ నుంచి రవాణా ఛార్జీలు చెల్లిస్తారు.

విలీనానికి తల్లిదండ్రుల కమిటీ తీర్మానాలు అవసరం లేదు.

ఆశ్రమ, రెసిడెన్షియల్‌ పాఠశాలలకు మ్యాపింగ్‌ నుంచి మినహాయింపు. వీటికి ప్రత్యేక మార్గదర్శకాలు ఇస్తారు.

విద్యార్థులు తక్కువగా ఉండే ఉన్నత పాఠశాలల హోదాను తగ్గించి, ప్రాథమికోన్నత బడులుగా మార్పు చేస్తారు. వీటిల్లోని 9,10 తరగతుల వారిని సమీపంలోని ఉన్నత పాఠశాలకు పంపిస్తారు.

మూడు కిలోమీటర్లలోపు ఉర్దూ మాధ్యమ ఉన్నత పాఠశాల లేకపోతే ప్రాథమిక తరగతుల వారిని ఇతర మాధ్యమ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు.

రైల్వేగేట్లు దాటి వెళ్లడం ఎలా?: వంతెనలు ఉండే కాల్వలు, రైల్వేగేట్లు దాటి వెళ్లడం 10ఏళ్లలోపు పిల్లలకు ఎలా సాధ్యమవుతుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలంలో కాల్వలు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంటాయని..ఇలాంటి సమయంలో పిల్లల్ని ఒంటరిగా బడులకు పంపడం ఎలా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని