AP News: వంతెనల పూర్తికీ రుణం

రాష్ట్రంలో వివిధ రహదారుల పనులు చేసేందుకు బ్యాంకు రుణాలపై ఆధారపడుతున్న ప్రభుత్వం.. తాజాగా వంతెనలు పూర్తి చేసేందుకు కూడా మరో రుణం తీసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్ర, జిల్లా రహదారుల్లో వంతెనల పనులకు చెల్లింపులు లేకపోవడంతో చాలాకాలంగా గుత్తేదారులు వీటిని ఆపేశారు.

Updated : 14 Feb 2022 06:17 IST

నిడాలో రూ.711కోట్లు తీసుకునేందుకు మంతనాలు
మూడేళ్లకుపైగా నిలిచిన పనులు
చెల్లింపులు చేస్తేనే 14ఆర్వోబీలు, 34 వంతెనలు కొలిక్కి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వివిధ రహదారుల పనులు చేసేందుకు బ్యాంకు రుణాలపై ఆధారపడుతున్న ప్రభుత్వం.. తాజాగా వంతెనలు పూర్తి చేసేందుకు కూడా మరో రుణం తీసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్ర, జిల్లా రహదారుల్లో వంతెనల పనులకు చెల్లింపులు లేకపోవడంతో చాలాకాలంగా గుత్తేదారులు వీటిని ఆపేశారు. రుణం తీసుకొని.. ఇప్పటికే చేసిన పనులకు తొలుత చెల్లింపులు జరిపి, మిగిలిన పనులు పూర్తి చేయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ చోట్ల రైల్వే క్రాసింగ్‌ల వద్ద 17 ఆర్వోబీలు, పదుల సంఖ్యలో వివిధ నదులు, వాగులు వంకలు తదితరాలపై వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ గతంలో ప్లాన్‌ వర్క్‌ల కింద మంజూరయ్యాయి. మూడేళ్లకుపైగా వీటికి చెల్లింపులు లేవు. తాజాగా ప్రాధాన్య క్రమంలో 14 ఆర్వోబీలు, 34 వంతెనలు తొలుత పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకు రూ.711 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు.

ఆర్థిక శాఖ ఆమోదం: ప్లాన్‌ వర్క్‌ల కింద గతంలో మంజూరై, నిలిచిపోయిన 223 రహదారుల పనులు పూర్తి చేసేందుకు గత ఏడాది నాబార్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ (నిడా) నుంచి రూ.1,168 కోట్లు రుణం తీసుకున్నారు. ఇప్పుడు వంతెనలకు కూడా నిడా వద్ద రుణాన్ని తీసుకోనున్నారు. ఇందుకు ఆర్థిక శాఖకు దస్త్రాన్ని పంపగా... తాజాగా దానికి ఆమోదం లభించింది. అధికారులు నిడాను సంప్రదించనున్నారు. వాణిజ్య బ్యాంకులు మాదిరిగానే నిడా ఇచ్చే రుణాలకు వడ్డీ ఉంటుంది.

వాహనదారులకు ఇక్కట్లు: ఆయా ఆర్వోబీలు, వంతెనలు చాలా కాలంగా ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు, కావలి, గుంటూరులో నందివెలుగు, పశ్చిమగోదావరి జిల్లాలో నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, చిత్తూరు జిల్లాలోని కరకంబాడి, కృష్ణా జిల్లాలో గుణదల, శ్రీకాకుళం జిల్లాలో పలాస, తదితర చోట్ల రైల్వే క్రాసింగ్‌ల వద్ద వంతెనలు పూర్తి కాలేదు. గేటు పడితే వాహనదారులు నిరీక్షించాల్సి వస్తోంది. అన్నిచోట్లా ఆర్వోబీల్లో రైల్వే శాఖ పనులు పూర్తి చేయగా, ఆర్‌అండ్‌బీకి చెందిన భాగం పెండింగ్‌లో ఉన్నాయి. కర్నూలు, అనంతపురం నగరాలు, శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఆర్వోబీలు, కుప్పంలో   ఆర్‌యూబీ గతంలో పూర్తి కాగా... వీటికి  చెల్లింపులు చేయాల్సి ఉంది.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపై నిర్మిస్తున్న వంతెన. దీనిని 2016లో రూ.72 కోట్లతో మంజూరు చేశారు. రెండేళ్లపాటు గుత్తేదారు పనులు చేశారు. రూ.21 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. తర్వాత సార్వత్రిక ఎన్నికలు.. తదనంతర పరిణామాలతో  చెల్లింపులు ఆపేశారు.  ఇప్పటి వరకు పనులు జరగలేదు. దీనిని పూర్తి చేసేందుకు రూ.51 కోట్లు అవసరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని