Azadi Ka Amrit Mahotsav: మేనన్‌ తలకు పెన్‌-గన్‌!

స్వాతంత్య్రానంతరం 500కుపైగా సంస్థానాలను వివిధ రకాలుగా ఒప్పించి భారతావనిని ఏకం చేసిన ధీరుడు సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌! ఆ క్రమంలో పటేల్‌, ఆయన బృందం ఎదుర్కొన్న సవాళ్లు బోలెడు. హైదరాబాద్‌పై పోలీస్‌చర్య, కశ్మీర్‌ విలీనం చాలా మందికి తెలిసిన కథలు! కానీ తెలియనివి చాలానే ఉన్నాయ్‌

Updated : 31 Oct 2021 06:14 IST

స్వాతంత్య్రానంతరం 500కుపైగా సంస్థానాలను వివిధ రకాలుగా ఒప్పించి భారతావనిని ఏకం చేసిన ధీరుడు సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌! ఆ క్రమంలో పటేల్‌, ఆయన బృందం ఎదుర్కొన్న సవాళ్లు బోలెడు. హైదరాబాద్‌పై పోలీస్‌చర్య, కశ్మీర్‌ విలీనం చాలా మందికి తెలిసిన కథలు! కానీ తెలియనివి చాలానే ఉన్నాయ్‌. నేడు పటేల్‌ జయంతి సందర్బంగా వాటిలో కొన్ని...

భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటిస్తూనే... పాకిస్థాన్‌ను వేరుచేసిన బ్రిటిష్‌ ప్రభుత్వం మరో కొర్రీ కూడా పెట్టింది. 563 సంస్థానాలు భారత్‌లో లేదా పాకిస్థాన్‌లో చేరొచ్చు... లేదంటే స్వతంత్రదేశాలుగా ఉండొచ్చు అని నిర్ణయించుకునే స్వేచ్ఛనిచ్చింది. ఈ సంస్థానాధీశులందరికీ కలసి సంఘంలాంటి ‘ఛాంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌’ ఉండేది. అందులో తర్జనభర్జనలు జరిగాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ల్లోని సంస్థానాలన్నీ కలసి భారత్‌, పాకిస్థాన్‌లతో కలవకుండా ఒక దేశంగా ఉందామని ప్రతిపాదించాడు భోపాల్‌ నవాబు హమీదుల్లాఖాన్‌. ఇంతలో పటేల్‌ తన నమ్మకస్థుడైన సహచరుడు వీపీ మేనన్‌తో కలసి సంస్థానాధీశులందరినీ ఒప్పించే పనిలో పడ్డారు. చకచకా ఒక్కొక్కరిని కలవటం... ఒప్పించి విలీనపత్రంపై సంతకం చేయించటం యుద్ధప్రాతిపదికన సాగింది.

ఊగిసలాడిన జోధ్‌పుర్‌
హిందూ ప్రజలు, హిందూ రాజు చేతిలో ఉండి కూడా పాకిస్థాన్‌ వైపు చూసిన సంస్థానం జోధ్‌పుర్‌! పాకిస్థాన్‌తో సరిహద్దు ఉండటంతో పాటు కరాచీ రేవును, మిలిటరీని ఇస్తానన్న జిన్నా హామీతో జోధ్‌పుర్‌ మహారాజు హన్వంత్‌సింగ్‌ ఊగిసలాడారు. జైసల్మేర్‌ రాజుతో కలసి ముస్లింలీగ్‌ నేత జిన్నాను కలిశారు. పాకిస్థాన్‌లో కలిస్తే తమకేమిస్తారో చెప్పాలన్నారు. ‘ఇదిగో తెల్లకాగితం. మీకేం కావాలంటే అది ఇస్తాను. రాసుకోండి. సంతకం పెడతాను’ అంటూ హామీ ఇచ్చారు జిన్నా. కానీ హిందూ-ముస్లింల మధ్య గొడవల ప్రస్తావనతో... ఒప్పందం కాలేదు. జోధ్‌పుర్‌ మహారాజు పునరాలోచనలో పడ్డారు. ఈ విషయం తెలిసిన మేనన్‌... వెంటనే జోధ్‌పుర్‌ వెళ్లి  భారత్‌లో చేరాల్సిందిగా రాజుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఓ దశలో ఇద్దరిమధ్యా సంభాషణ ముదిరింది. బెదిరింపులకు లొంగేది లేదంటూ... జేబులోంచి పెన్‌తీసి మేనన్‌ నుదుటికి గురిపెట్టారు మహారాజు హన్వంత్‌సింగ్‌. అది పైకి పెన్నులా కన్పించే రహస్య గన్‌! అదే సమయంలో వచ్చిన గవర్నర్‌ జనరల్‌ మౌంట్‌బాటెన్‌ పరిస్థితిని చల్లార్చి... ఆ పెన్‌-గన్‌ను మహారాజు నుంచి బలవంతపు బహుమతిగా తీసుకొని జేబులో పెట్టుకున్నారు. తర్వాత హన్వంత్‌సింగ్‌ భారత్‌లో విలీనంపై సంతకం చేశారు.

ట్రావెన్‌కోర్‌ అణు మానం...
కేరళలోని ట్రావెన్‌కోర్‌ సంస్థానం కూడా స్వతంత్రదేశంగా ఉండాలని నిర్ణయించుకుంది. అణుబాంబుల్లో ఉపయోగపడే థోరియం నిల్వలు ఈ ప్రాంతంలో భారీస్థాయిలో ఉండటంతో ట్రావెన్‌కోర్‌పై బ్రిటన్‌, అమెరికా, రష్యాలు అప్పటికే కన్నేశాయి. ఈ సంస్థానం స్వతంత్రంగా ఉండటానికే బ్రిటన్‌ మొగ్గుచూపింది. ఆ దిశగానే వారిని ప్రోత్సహించింది. ఫలితంగా ట్రావెన్‌కోర్‌ ప్రధాని సర్‌ సీపీ రామస్వామి అయ్యర్‌ 1947 జూన్‌ 11న తాము భారత్‌, పాకిస్థాన్‌లలో కలవబోమని ప్రకటించారు. ప్రజలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. అయినా పట్టించుకోలేదు. జులై 30 తనపై కేరళ సోషలిస్టు పార్టీ సభ్యుడొకరు చేసిన హత్యాయత్నంతో రామస్వామిలో మార్పువచ్చి... భారత్‌లో విలీనంపై సంతకాలు చేశారు.

భార్యలను వదిలి... కుక్కలతో కరాచీకి
గుజరాత్‌లోని జునాగఢ్‌ది మరో చిత్రమైన పరిస్థితి. హిందువులు మెజారిటీగా ఉన్న ప్రజలకు ముస్లిం రాజిక్కడ. సర్‌ మహమ్మద్‌ మహాబత్‌ ఖాన్జీ మహారాజు... ప్రజలతో కంటే తన కుక్కలతో ఎక్కువగా గడిపేవాడు. తనకిష్టమైన కుక్క రోష్‌నారాకు లక్షల రూపాయలు ఖర్చుచేసి పెళ్లి కూడా చేశాడు. తన ప్రధాని షానవాజ్‌ భుట్టో (బెనజీర్‌ భుట్టో తాత) సలహా మేరకు పాకిస్థాన్‌లో కలవనున్నట్లు ప్రకటించారు ఖాన్జీ. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆర్థికవ్యవస్థ అల్లకల్లోలమైంది. జునాగఢ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని పాకిస్థాన్‌కు ప్రతిపాదించారు పటేల్‌! ఇంతలో పరిస్థితి చేయిదాటుతుండటంతో దిల్లీ నుంచి సైన్యాన్ని దింపారు. నిధులు, సైన్యం కొరతతో మహారాజు చేతులెత్తేసి విమానంలో కరాచీకి పారిపోయారు. తన ఆభరణాలు, సొమ్ములతో పాటు తనకత్యంత ఇష్టమైన కుక్కలన్నింటినీ ఆ విమానంలో ఎక్కించుకున్న మహబత్‌ ఖాన్జీ... తన భార్యల్లో కొందరిని మాత్రం ఇక్కడే వదిలి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని