Andhra News: ఇల్లు కట్టుకుంటారా... కట్టుకోలేమని రాసిస్తారా!

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద చేపట్టిన గృహనిర్మాణాలను వేగిరం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అన్నిస్థాయుల అధికారుల్ని,

Updated : 17 Feb 2022 07:47 IST

గృహ నిర్మాణాలను వేగిరం చేసేందుకు అధికారుల చర్యలు

నేరుగా లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్న వైనం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద చేపట్టిన గృహనిర్మాణాలను వేగిరం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అన్నిస్థాయుల అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని వినియోగిస్తున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయంలోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, గృహనిర్మాణ శాఖ ఏఈ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు లబ్ధిదారుల దగ్గరకు వెళుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సర్పంచి, ఎంపీటీసీలను భాగస్వాములను చేస్తున్నారు. పథకంపై అవగాహన కల్పించే పేరుతో లబ్ధిదారుల దగ్గరకు వరుస కడుతున్నారు. నిర్మాణాలకు ముందుకురాని పక్షంలో నోటీసులు జారీ చేస్తామని కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు చెబుతున్నారు. ఇల్లు కట్టుకునేందుకు ఇప్పుడు చేతిలో డబ్బుల్లేవ్‌ అని మొత్తుకుంటే... ఆ విషయాన్ని కాగితంపై రాసివ్వాలని లబ్ధిదారులకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే లబ్ధిదారుల నుంచి లిఖిత పూర్వకంగా పత్రాలు తీసుకున్నారు.

స్వచ్ఛందంగానే రాసివ్వండి....

పథకం కింద మొదటి విడతగా ప్రభుత్వం 15.75 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 13.26 లక్షల వరకు నిర్మాణాలు ప్రారంభంకాగా వాటిలో 1.99 లక్షల గృహాలు పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో ఆశించినస్థాయిలో పురోగతి లేదు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికారులు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఆ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పథక ప్రయోజనాల్ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ కింద రూ.1.80 లక్షలు ఇస్తున్నాయని, పావలా వడ్డీ కింద రూ.35 వేలు రుణం ఇప్పిస్తామని చెబుతున్నారు. అయినా నిర్మాణాలకు ధైర్యం చేయడం లేదు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు ఎక్కడ సరిపోతాయని అధికారుల్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆప్షన్‌-3 కింద ఎంపిక చేసుకున్నామని, ప్రభుత్వమే కట్టిస్తామని చెప్పిందని మరికొందరు స్పష్టం చేస్తున్నారు. తాము నివసిస్తున్న ప్రాంతానికి దూరంగా ఉన్న లేఅవుట్‌లో స్థలం కేటాయించారని అక్కడికి వెళ్లి ఇల్లు కట్టుకుని ఎలా బతకాలని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. తమపై ఉన్నతాధికారుల ఒత్తిడి ఉందని ఇల్లు కట్టుకోలేమంటే అందుకు కారణమేమిటో రాతపూర్వకంగా స్వచ్ఛందంగా రాసివ్వాలని అధికారులు కోరుతున్నారు.

మౌఖిక ఆదేశాలు...

లబ్ధిదారుల నుంచి రాతపూర్వక సమాధానం తీసుకోవడంపై కడప జిల్లాలో ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కమలాపురం నియోజకవర్గం వీరపునాయునిపల్లె మండల పరిధిలోని ఒక పంచాయతీలో 10 మంది లబ్ధిదారుల నుంచి ఇప్పటికే లిఖిత పూర్వకంగా పత్రాలు తీసుకున్నారు. ఇల్లు కట్టుకునేందుకు ముందుకు రాకపోతే సమస్యను తెలుపుతూ రాతపూర్వకంగా రాసివ్వాలని జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో అధికారులు చెప్పినట్లు లబ్ధిదారులు వాపోతున్నారు.  ప్రభుత్వమే ఇల్లు కట్టించాలని కొంతమంది లబ్ధిదారులు విజయనగరం జిల్లా డత్తిరాజేరు మండలంలో అధికారులకు రాసిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోనూ లబ్ధిదారులకు ఇదే తరహా ఆదేశాలు వెళ్లాయి. ఇళ్ల మంజూరు పత్రం ఇచ్చి ఏడాది అయింది... ఇంకా ఎందుకు ప్రారంభించలేదు? కట్టుకుంటారా... కట్టుకోరా... రాతపూర్వకంగా రాసివ్వండని విశాఖ జిల్లాలో లబ్ధిదారులను కోరుతున్నారు. 

ప్రారంభించకుంటే రాయితీ రద్దు

పశ్చిమగోదావరి జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకురాని వారికి నోటీసులు జారీకి సిద్ధం చేశారు. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు నోటీసులు చేరాయి. నోటీసు, రసీదు, లబ్ధిదారుని సమాధానం పేరుతో ఈ పత్రాలను రూపొందించారు. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం’ కింద జగనన్న లేఅవుట్‌లో పట్టా మంజూరు చేశాం. ఆ స్థలంలో గృహనిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేసి ఏడాది పూర్తయింది. ఇంతవరకు నిర్మాణం చేపట్టలేదు. నిర్దేశిత మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో వినియోగించకోకపోతే రద్దవుతుంది. ఈ నోటీసు అందిన 15 రోజుల్లో నిర్మాణాన్ని చేపట్టాలి...’ అని నోటీసులో పేర్కొన్నారు. నోటీసు లబ్ధిదారునికి అందిందని ధ్రువీకరించేందుకు రసీదు సిద్ధం చేశారు. ఏ కారణంతో ఇంతవరకు ఇల్లు కట్టుకోలేకపోయారో... ఆ విషయాన్ని లబ్ధిదారుని నుంచి సేకరించేందుకు నాలుగు ఆప్షన్లతో కూడిన మరో పత్రాన్ని రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని