Andhra news: కోరంగిలోకి ఆక్వా వ్యర్థాల వెల్లువ

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించిన కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆక్వా వ్యర్థాలతో కలుషితమవుతున్నట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)

Updated : 10 Aug 2022 03:48 IST

తీరప్రాంత నియంత్రణ నోటిఫికేషన్‌ అమల్లో ఉన్నా ఫలితం సున్నా: కాగ్‌

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించిన కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆక్వా వ్యర్థాలతో కలుషితమవుతున్నట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) పార్లమెంటుకు సమర్పించిన తాజా నివేదికలో పేర్కొంది. ఇక్కడ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌కు విరుద్ధంగా ఉల్లంఘనలు జరుగుతున్నాయని, పర్యావరణం, జీవవైవిధ్యం దుర్లభంగా మారుతోందని ఆందోళన చెందింది. పగడపు దిబ్బలు, తాబేళ్లు గూడుకట్టుకొనే ప్రాంతాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదని ఆక్షేపించింది. ‘2011 సీఆర్‌జడ్‌ నోటిఫికేషన్‌ ప్రకారం కోరంగిని సంక్లిష్టమైన దుర్బల తీరప్రాంతంగా గుర్తించారు. మడ అడవులు, చిత్తడినేలలు, బీచ్‌లు, ద్వీపాలతో నిండిన ఈ అభయారణ్యాన్ని ఏపీ ప్రభుత్వం 1978లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. తాళ్లరేవు మండలంలో ఆక్వాకల్చర్‌ కింద నమోదైన 1,483.05 హెక్టార్ల భూమి కోరంగిని మూడువైపుల నుంచి చుట్టేసింది. అందులో 861.64 హెక్టార్లు కోరంగి కేంద్రానికి ఆనుకునే ఉంది. తాళ్లరేవు మండలంలోని 11 ఆక్వా యూనిట్లు శుద్ధిచేయని వ్యర్థాలను డ్రెయిన్లలోకి వదులుతున్నాయి. అవి కోరంగి నదిలో కలుస్తున్నాయి. వీటిలో పీహెచ్‌ మినహా మిగిలినవన్నీ ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ 11 యూనిట్లలో ఐదింటికి ఏపీ పీసీబీ 2017-20 మధ్య నోటీసులు ఇచ్చినా, చర్యలు తీసుకోలేదు. శుద్ధిచేయకుండానే వ్యర్థాలను వదిలిపెడుతున్న ఆరు యూనిట్లకు నోటీసులూ ఇవ్వలేదు. సరైన పరిశీలన లేకుండానే యూనిట్ల నిర్వహణకు మత్స్యశాఖ అనుమతులిచ్చింది. వ్యర్థాల శుద్ధి తీరును చూడకుండానే పీసీబీ ఆమోదం తెలిపింది. స్టేట్‌/టౌన్‌ప్లానింగ్‌, స్టేట్‌ కోస్టల్‌జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీల అనుమతులు లేవు. సీఆర్‌జడ్‌ నిబంధనలూ విస్మరించారు. సీఆర్‌జడ్‌ నోటిఫికేషన్లు అమల్లో ఉన్నా.. తీరప్రాంతాల్లో కాలుష్యకారక పనులు కొనసాగుతున్నాయి. ఫలితంగా పర్యావరణం మరింత దిగజారుతోంది’ అని కాగ్‌ పేర్కొంది. గుంటూరు జిల్లాలోగాయత్రి హ్యాచరీ, సూర్యవంశీ ష్రింప్‌ హ్యాచరీస్‌ సముద్ర జలాల కాలుష్యానికి కారణమవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని