బీమా అందక బిక్కుబిక్కు

రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ బీమా అమలు తీరు మాటలు కోటలు దాటినా, కాళ్లు గడప దాటని చందంగా ఉంది. బీమా క్లెయిమ్‌ల పరిష్కారానికి గరిష్ఠంగా 4-5 నెలల సమయం పడుతోంది.

Updated : 27 Nov 2022 05:51 IST

9,092 సహజ మరణాలపై కుటుంబాలకు సాయం కరవు
ప్రమాద మృతుల క్లెయిమ్‌లలో 30.83 శాతమే పరిష్కారం
వైఎస్‌ఆర్‌ బీమాలో ప్రచార ఆర్భాటమే ఎక్కువ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ బీమా అమలు తీరు మాటలు కోటలు దాటినా, కాళ్లు గడప దాటని చందంగా ఉంది. బీమా క్లెయిమ్‌ల పరిష్కారానికి గరిష్ఠంగా 4-5 నెలల సమయం పడుతోంది. క్లెయిమ్‌లను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వమే స్వయంగా ప్రకటించినా ఆచరణలో కనిపించడం లేదు. 2021-22లో 2,631 ప్రమాద మృతుల  క్ల్లెయిమ్‌ల పరిష్కారంలో అతీగతీ లేదు. బాధిత కుటుంబాలు బీమా సాయం కోసం నిరీక్షిస్తున్నాయి. ఈ ఏడాది (2022-23) కూడా ప్రమాద మృతులకు సంబంధించిన మొత్తం క్ల్లెయిమ్‌ల్లో ఇప్పటివరకు 39.83 శాతమే పరిష్కారమయ్యాయి. 1.21 కోట్ల మందికి ఈ ఏడాది బీమా కల్పించినట్టు ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. 18-50 ఏళ్లలోపు వారిలో సహజమరణానికి  రూ.లక్ష చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 18-70 ఏళ్ల వారిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన, ప్రమాద కారణంగా పూర్తిగా అంగవికలురైన వారికి బీమా సంస్థ రూ.5 లక్షల పరిహారం ఇస్తుందని సర్కారు ప్రచారం చేస్తోంది. ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) కింద కేంద్రమిచ్చే 50% వాటా నిలిపేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరఫున పూర్తిగా ప్రీమియం చెల్లిస్తూ 2021 జులై నుంచి వైఎస్‌ఆర్‌ బీమా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వేదికపైనా ప్రచారం చేస్తోంది. క్ల్లెయిమ్‌ల పరిష్కారంలో మాత్రం ఏమాత్రం వేగం లేదు.

* ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు నమోదైన 9,092 సహజ మరణాలకు సంబంధించిన క్లెయిమ్‌లపై రూపాయి చెల్లించలేదు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఇందుకు సంబంధించి ఇప్పటికీ నిధులివ్వలేదు. ఈ ఏడాది జులైనుంచి ఇప్పటివరకు  నమోదైన ప్రమాద మృతులకు సంబంధించిన 620 క్ల్లెయిమ్‌ల్లోనూ ఇప్పటికి 247 పరిష్కారమయ్యాయి. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా సంస్థ జమ చేయాల్సి ఉంది.

* గతేడాది జులై నుంచి ఈ ఏడాది జూన్‌ మధ్య నమోదైన ప్రమాద మృతులకు సంబంధించిన 2,631 క్ల్లెయిమ్‌లు ఇప్పటికీ పరిష్కరించలేదు. అన్ని దశల్లోనూ పరిశీలించాక ఆమోదించిన క్లెయిమ్‌లు దాదాపు ఏడాదిగా నిలిచాయి. బీమా సంస్థ నిర్లక్ష్యం కారణంగా చెల్లింపుల్లో జాప్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిపై ఫిర్యాదులు స్వీకరించే అంబుడ్స్‌మన్‌ని ఆశ్రయించామని అంటున్నారు. క్లెయిమ్‌ల పరిష్కారానికి సంబంధించి కోరిన సమాచారం ప్రభుత్వశాఖల నుంచి సకాలంలో రానందున చెల్లింపులు చేయలేకపోయామని అంబుడ్స్‌మన్‌కు బీమా సంస్థ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.


క్లెయిమ్‌ చేసిన 15 రోజుల్లోగా బీమా చెల్లింపు. బీమా మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ. గతంలో ఉన్నట్టు ప్రతి పాలసీకి పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై కింద కేంద్రమిచ్చే 50% వాటా ఇప్పుడు లేనప్పటికీ మానవతా దృక్పథంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచిత బీమా అమలు చేస్తోంది.

- ‘వైఎస్‌ఆర్‌ బీమా’పై రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబరు 21న చేసిన ప్రకటన సారాంశమిది


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని