Indian Independence:ఐక్యత వీడొద్దు.. పాక్ను కోరొద్దు
మతకలహాలు చెలరేగుతూ... విద్వేషం విశ్వరూపం చూపుతున్న దశ.. ముస్లింలకు ప్రత్యేక పాకిస్థాన్ ఇవ్వాల్సిందే అంటూ నినాదాలు రోజురోజుకూ బలపడుతున్న వేళ... ఆంగ్లేయుల కుట్రలో
మతకలహాలు చెలరేగుతూ... విద్వేషం విశ్వరూపం చూపుతున్న దశ.. ముస్లింలకు ప్రత్యేక పాకిస్థాన్ ఇవ్వాల్సిందే అంటూ నినాదాలు రోజురోజుకూ బలపడుతున్న వేళ... ఆంగ్లేయుల కుట్రలో పడొద్దనీ... హిందూ-ముస్లింలు కొట్లాడుకోవద్దని... పాకిస్థాన్ ఏర్పాటు వద్దంటే వద్దనీ నినదించిందో కంఠం! అది రాజకీయ గొంతుక కాదు. ఓ ముస్లిం మతపెద్ద మాట. ఆయనే- మౌలానా హుసేన్ అహ్మద్ మదాని.
అన్ని విధాలుగా భారత్లో విభజించి పాలించే సిద్ధాంతాన్ని అమలు చేసిన ఆంగ్లేయులు తొలుత హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టారు. ఆ తర్వాత హిందువుల్లో కులాల మధ్య అంతరం సృష్టించారు. ముస్లింల్లోనూ సున్నీ-షియాల్లో విభేదాల అగ్గిరగిల్చారు. ఆంగ్లేయుల ఎత్తుగడలోని ఆంతర్యాన్ని ముందే గ్రహించిన ముస్లిం మేధావి మౌలానా హుసేన్్ మదాని... ఆది నుంచీ దీనిపై హెచ్చరిస్తూనే వచ్చారు.
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలోని బంగర్మావు అనే చిన్న పట్టణంలో 1879లో జన్మించిన మౌలానా మదాని తండ్రి సయ్యద్ హబీబుల్లా. ఇస్లాం వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త వారసుల్లో 35వ తరానికి చెందిన కుటుంబం వీరిదంటారు. 13వ ఏట మదాని దారుల్ ఉలూమ్ దియోబంద్ (సున్నీ ఉద్యమంతో ముడిపడిన విద్యాలయం)లో చేరి మహమ్మద్ హసన్ వద్ద శిష్యరికం చేశారు. అక్కడ చదువు పూర్తయ్యాక సౌదీలోని పవిత్ర మదీనాకు వెళ్లి 28 సంవత్సరాలు అరబిక్ వ్యాకరణం బోధించి భారత్కు తిరిగి వచ్చారు. ఇంతలో భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతిస్తున్న కారణంగా తన గురువు మహమ్మద్ హసన్ను ఆంగ్లేయులు జైలులో బంధించారు. ఆయనకు మద్దతుగా తాను కూడా మూడేళ్లపాటు జైలులో ఉన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక నేరుగా భారత జాతీయోద్యమంలో భాగమయ్యారు. ఆది నుంచీ... హిందూ-ముస్లిం ఐక్యతను ప్రబోధిస్తూ... పాకిస్థాన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చారు. పాకిస్థాన్ విషయంలో ఈ ముస్లిం మేధావికి, పాక్ మద్దతుదారు మహమ్మద్ ఇక్బాల్కు మధ్య ఆ కాలంలో పెద్ద వాగ్యుద్ధమే సాగింది.
‘భారత్లో ముస్లింలు హిందువులతో కలసి జీవనం సాగించటానికి చాలాకాలంగా అలవాటు పడ్డారు. ఇద్దరు మనుషుల మతాలు వేరైనా.. ఒకే చోట పుట్టినప్పుడు అనేక అంశాల్ని పంచుకుంటూ కలసిమెలసి జీవిస్తూనే ఉంటాం. బజార్లలో, వీధుల్లో, రైళ్లలో, బస్సుల్లో, లారీల్లో, కాలేజీల్లో, కోర్టుల్లో, అసెంబ్లీలో, హోటళ్లలో... ఇలా ఒక్కటని కాదు. ప్రతిచోటా మనం ఒకరికొకరు ఎదురవని చోటేదైనా ఉంటుందా? ముస్లిం వ్యాపారి హిందువుకు వస్తువులు అమ్మడా? ముస్లిం లాయర్కు హిందూ క్లయింట్లు ఉండరా? ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గంలోని ఇతర మతస్థులకు ప్రాతినిధ్యం వహించరా? ఈ హిందూ-ముస్లిం విభజన అనేది ఆంగ్లేయుడు మనందరిపై తన పెత్తనం కోసం నాటిన విషపు విత్తనం. ఈ విభజించు పాలించు ఎత్తుగడలో పడి... వారి చేతిలో పావులమై... దేశాన్ని విభజిస్తే దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి’ అంటూ లేఖ రాసి ముస్లింలను చైతన్య పరిచారు మౌలానా మదాని. ఆయన ప్రభావం కారణంగా... తూర్పు ఉత్తర్ప్రదేశ్, బిహార్ల్లోని ముస్లింలు చాలామంది విభజన సమయంలో పాకిస్థాన్కు వెళ్లకుండా భారత్నే తమ స్వదేశంగా ఎంచుకున్నారు. స్వాతంత్య్రా నంతరం భారత ప్రభుత్వం 1954లో మొదటి పద్మభూషణ్ అవార్డుతో మౌలానా మదానిని సత్కరించింది. భారత్లో హిందూ-ముస్లింల ఐక్యతకు తుదకంటా కోరుకున్న ఆయన 1957 డిసెంబరు 5న కన్నుమూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!