Nellore Court: ఆధారాల చోరీకి కారకులు ఎవరు?

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా (ఏ1) ఉన్న ఫోర్జరీ, మోసం, తప్పుడుపత్రాల సృష్టి కేసులో పరిణామాలన్నీ తొలి నుంచి సంచలనంగానే ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ కేసును ఉపసంహరించుకునేందుకు వీలుగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో

Updated : 17 Apr 2022 06:22 IST

నెల్లూరు కోర్టు నుంచి పత్రాల దొంగతనం

అవి వ్యవసాయ మంత్రి కాకాణి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా (ఏ1) ఉన్న ఫోర్జరీ, మోసం, తప్పుడుపత్రాల సృష్టి కేసులో పరిణామాలన్నీ తొలి నుంచి సంచలనంగానే ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ కేసును ఉపసంహరించుకునేందుకు వీలుగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు విచారణ కీలకదశకు చేరుకుంటున్న తరుణంలో ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన దస్త్రాలు, పత్రాలు, ఆధారాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తదితరాలు ఏకంగా న్యాయస్థానం నుంచే చోరీకావటం రాష్ట్రంలో సంచలనమైంది. మంత్రి నిందితుడిగా ఉన్న కేసులో కీలకపత్రాలు, ఆధారాల్ని న్యాయస్థానంలో తాళాలు పగలకొట్టి మరీ దొంగలు ఎత్తుకుపోవటంపై అంతటా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. బిహార్‌లో అరాచక పాలన జరిగినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు లేవని, అలాంటి దారుణాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకోవటం అత్యంత ప్రమాదకరమని ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలకే భద్రత లేకపోతే ఏ కేసులో నిందితులైనా ఇదే తరహాలో ఆధారాల్ని, పత్రాల్ని చోరీ చేసుకుంటూ వెళ్లిపోయే పరిస్థితులు దాపురిస్తాయేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత రచ్చ జరుగుతున్నా.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మంత్రి గోవర్ధన్‌రెడ్డి కానీ, హోం మంత్రి తానేటి వనిత కానీ స్పందించలేదు. ప్రభుత్వం, డీజీపీ వైపు నుంచీ ఎలాంటి ప్రకటన లేదు. నెల్లూరు నాలుగో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో దొంగతనం జరిగి మూడు రోజులవుతున్నా ఈ కేసులో ఇప్పటివరకూ పురోగతి లేదు.

నేర నిరూపణ అయితే ఏడేళ్లు జైలుశిక్ష

ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి 2016 డిసెంబర్‌ 23న అప్పటి వ్యవసాయ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై విలేకర్ల సమావేశంలో పలు ఆరోపణలు చేశారు. సోమిరెడ్డికి మలేషియాలో భూములు, థాయ్‌లాండ్‌లో విద్యుత్తు ప్రాజెక్టుతో పాటు ఆయన కుటుంబీకుల పేరిట సింగపూర్‌, హాంకాంగ్‌లోని బ్యాంకుల్లో మిలియన్‌ డాలర్ల సొమ్ము ఉందని ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలంటూ కొన్ని డాక్యుమెంట్లు, పత్రాలు చూపించారు. ఆస్తుల్ని చూసుకునేందుకు సోమిరెడ్డి 2003 సెప్టెంబరు 13న మలేషియా వెళ్లారంటూ కొన్ని పత్రాల్ని చూపించి వాటి ప్రతులూ అందించారు. అవన్నీ ఫోర్జరీ పత్రాలు, తప్పుడు డాక్యుమెంట్లు అంటూ 2016 డిసెంబరు 28న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు గ్రామీణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 120 (బి), 468, 469, 471, 506లతో పాటు ఐటీ చట్టంలోని 65, 71 సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు ప్రధాన నిందితుడైన కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఫోర్జరీ, అంతర్జాతీయ డాక్యుమెంట్ల ఫ్యాబ్రికేషన్‌, విదేశీ బ్యాంకు ఖాతాల ప్రతులు, ఇమ్మిగ్రేషన్‌ ఎంట్రీల ప్రతుల ఫ్యాబ్రికేషన్‌, నకిలీ పాస్‌పోర్టు సృష్టి తదితర అభియోగాలు మోపుతూ నెల్లూరు నాలుగో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో కాకాణి నేరం చేసినట్లు నిరూపణయితే ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

వైకాపా ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసు ఎత్తేస్తూ ఉత్తర్వులు

* 2019 మే నెలలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టింది. తర్వాత ఏడాది వ్యవధిలోనే ముఖ్యమంత్రి, మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు సహా 19 మందిపై వివిధ కేసుల్లో ప్రాసిక్యూషన్‌ ఉపసంహరించుకుంటూ వేర్వేరు ఉత్తర్వులిచ్చింది. అందులో భాగంగానే 2020 జూన్‌ 9న అప్పటి వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఉన్న కేసులో ప్రాసిక్యూషన్‌ ఉపసంహరించుకుంటూ హోం శాఖ జీవో నంబర్‌ 560 జారీ చేసింది. 

* ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్‌ కేసుల్ని హైకోర్టు అనుమతి లేకుండా ఉపసంహరించటానికి వీల్లేదంటూ 2021 ఆగస్టులో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో కాకాణిపై కేసులో ప్రాసిక్యూషన్‌ ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసినా ఉపసంహరణ సాధ్యపడలేదు. 

* ప్రస్తుతం ఈ కేసు ప్రజాప్రతినిధులపై కేసులు విచారించే విజయవాడలోని ప్రత్యేక కోర్టు పరిధిలో ఉంది. ఇంతవరకు నెల్లూరులోని ట్రయల్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించిన కీలకపత్రాలు, దస్త్రాలు, ఆధారాలు తదితరాలన్నీ అక్కడ నుంచి విజయవాడ కోర్టుకు ఇంకా రాలేదు. ఈలోపు నెల్లూరు కోర్టు ఆధీనంలో ఉన్న కేసు సాక్ష్యాధారాలు, కీలకపత్రాల్ని దొంగలు తస్కరించడం దుమారం రేపుతోంది. ఈ నెల 11న కాకాణి గోవర్ధన్‌రెడ్డి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మూడో రోజే (13వ తేదీ అర్ధరాత్రి) ఆయన నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలు, దస్త్రాలు, ఆధారాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు న్యాయస్థానం నుంచే చోరీకి గురికావటం చర్చనీయాంశంగా మారింది.


కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణ చేయించాలి

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజుల్లోనే ఆయనపై ఉన్న కేసు సాక్ష్యాధారాలే చోరీకి గురవడం.. ఇది మంత్రికి సంబంధించిన వ్యక్తులు చేశారేమోనన్న అనుమానాల్ని రేకెత్తిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో విచారణ జరిపితే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మడం లేదు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే మిగిలిన కోర్టుల్లోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విచారణ సంస్థ ద్వారా విచారణ చేయాలి. మంత్రిపై కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు దొంగిలించారు కాబట్టి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను అనుమానించాల్సి వస్తోంది. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. అమాయకులను ఈ కేసులో ఇరికించి అసలువారిని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకూ న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులపైనా దాడి చేయడం చూశాం. ఇప్పుడు న్యాయస్థానాల్లో కీలకపత్రాలు, సాక్ష్యాధారాలు కూడా చోరీకి గురవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు.

- ముప్పాళ్ల సుబ్బారావు, సీనియర్‌ న్యాయవాది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని