బ్యాంకులకు ₹6వేల కోట్ల మోసం.. ఐటీఎన్‌ఎల్‌ సంస్థపై సీబీఐ కేసు

దేశంలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో ఐటీఎన్‌ఎల్‌ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. కంపెనీ బోర్డు డైరెక్టర్ల అవగాహనతోనే ఈ మోసం జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. 

Published : 02 Jun 2023 20:48 IST

దిల్లీ: ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ (ITNL) సంస్థతో పాటు, ఆ కంపెనీ డైరెక్టర్లపై సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. 2016 - 2018 మధ్య కాలంలో 19 బ్యాంకులను ₹6,524 కోట్ల మోసం చేశారంటూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఐటీఎన్‌ఎల్‌ మోసం చేసిన బ్యాంకుల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌లతోపాటు మరికొన్ని బ్యాంక్‌లు ఉన్నాయి. 2018లో ఐటీఎన్‌ఎల్‌ దివాలా ప్రక్రియను ప్రకటించిగా.. అదే ఏడాది ఎన్‌సీఎల్‌టీ (NCLT) కంపెనీ పాత బోర్డ్‌ మెంబర్ల స్థానంలో కొత్త వారిని నియమించింది. దీంతో వేల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థకు అనుబంధంగా 348 కంపెనీలు ఉన్నాయి. 

సుమారు ₹6,524 కోట్ల ప్రజల సొమ్మును ఐటీఎన్‌ఎల్‌ సంస్థ పక్కదారి పట్టించిందని గతంలో సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో కెనరా బ్యాంక్‌ పేర్కొంది. కంపెనీ డైరెక్టర్లను వైట్‌కాలర్‌ నేరగాళ్లతో పోలుస్తూ.. వారంతా పూర్తి అవగాహనతోనే ఈ నేరానికి పాల్పడ్డారని ఆరోపించింది. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో రంగంలోకి దిగిన సీబీఐ విచారణ చేపట్టింది. ఐటీఎన్‌ఎల్‌ సంస్థ తన ఆదాయాన్ని ఎక్కువగా చూపుతూ, నిధులను మళ్లించిందని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ సంస్థ ఇతర కంపెనీలకు బదిలీ చేసిన నగదు మొత్తానికి సంబంధించి కంపెనీ సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి ఎంట్రీలు చేయలేదని ఆరోపించింది. సబ్‌-కాంట్రాక్టర్ల నుంచి ఎక్కువ మొత్తానికి నకిలీ కొటేషన్లు తీసుకుని 459 టన్నుల స్టీల్‌, టైర్లు కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. ఇలాంటి మరెన్నో మోసపూరిత లావాదేవీలతో ₹6,524 కోట్ల నిధులను పక్కదారి పట్టించిందని తెలిపింది. ఈ వ్యవహారం మొత్తం బోర్డు డైరెక్టర్ల అవగాహనతో జరిగిందని ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని