రాబడి హామీతో పన్ను ఆదా

నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను.

Updated : 10 May 2024 01:36 IST

నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. అధిక రాబడి వచ్చేలా ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

శ్రీధర్‌

మీకు ఎనిమిదేళ్ల సమయం ఉంది. కాబట్టి, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా మదుపు చేస్తే మంచి రాబడికి అవకాశం ఉంది. మీకు అధిక రాబడి కావాలంటే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. వీటిలో కాస్త అధిక నష్టభయం ఉంటుంది. మీ పెట్టుబడిలో రూ.1,000 చొప్పున మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లకు కేటాయించండి. మిగతా రూ.4,000 డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లకు మళ్లించండి. మీ పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి.

 మా అమ్మాయి వయసు 9. తన పేరుమీద కనీసం 12 ఏళ్లపాటు మదుపు చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం నెలకు రూ.10వేల వరకూ పెట్టుబడి పెడతాం. వీలును బట్టి, పెంచుకుంటూ వెళ్తాం. మంచి మొత్తం జమ కావాలంటే ఏం చేయాలి?

శరణ్య
ముందుగా మీ అమ్మాయి చదువు, ఇతర అవసరాలకు తగిన ఆర్థిక రక్షణ కల్పించేందుకు బీమా పాలసీలను తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తంలో రూ.3,000 సుకన్య సమృద్ధి యోజనలో జమ చేయండి. రూ.7,000 ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. మీరు నెలకు రూ.10వేల చొప్పున 12 ఏళ్లపాటు మదుపు చేస్తే 11 శాతం వార్షిక సగటు రాబడితో రూ.27,25,582 అయ్యేందుకు అవకాశం ఉంది.

నేను 30 శాతం పన్ను శ్లాబులో ఉన్నాను. ఇప్పుడు కొంత మొత్తాన్ని మదుపు చేయాలని అనుకుంటున్నాను. రాబడికి హామీ ఉంటూ, వచ్చిన మొత్తంపై పన్ను పడకుండా ఉండాలంటే ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

ప్రదీప్‌
రాబడికి హామీ ఉంటూ.. పన్ను ఆదా, వచ్చిన ఆదాయంపై పన్ను భారం లేకుండా ఉండాలంటే ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)ని పరిశీలించవచ్చు. ఇది 15 ఏళ్ల దీర్ఘకాలిక పెట్టుబడి. మీరు ఇందులో ఏడాదికి రూ.500 నుంచి రూ.1,500,000 వరకూ జమ చేయొచ్చు. కాబట్టి, దీన్ని ఎంచుకోవడం మంచిది. సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000లకు లోబడి ఇందులో పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది.
తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని