సైబర్‌ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కొట్టేశారు.. పోలీసులు 25 నిమిషాల్లోనే రప్పించారు

ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్‌ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది.

Updated : 30 Apr 2024 07:02 IST

బాధితుడి అప్రమత్తతకు సీఎస్‌బీ స్పందన తోడైన ఫలితం

ఈనాడు, హైదరాబాద్‌: ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్‌ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. వెనువెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు 25 నిమిషాల లోపే ఆ సొమ్మును వెనక్కి రప్పించారు. బాధితుడి అప్రమత్తతకు తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) తక్షణ స్పందన తోడు కావడంతో ఇదంతా సాధ్యమైంది. సైబర్‌ నేరస్థుల పాలైన సొమ్మును తిరిగి రప్పించడం గగనమైన ప్రస్తుత తరుణంలో ఈ తరహా ఉదంతం ‘గోల్డెన్‌ అవర్‌’ ఘనతను చాటిందని పోలీసులు వివరించారు.

టీఎస్‌సీఎస్‌బీ కథనం ప్రకారం.. హైదరాబాద్‌ నాచారానికి చెందిన హర్ష్‌ ఫోన్‌కు ఈ నెల 27న ఉదయం మూడు సంక్షిప్త సందేశాలు వచ్చాయి. అతడి ఖాతా నుంచి ఉదయం 10.09 గంటలకు రూ.50 లక్షలు, 10.10 గంటలకు మరో రూ.50 లక్షలు, 10.11 గంటలకు రూ.10 లక్షలు మరో ఖాతాకు బదిలీ అయ్యాయనేది వాటి సారాంశం. 10.17 గంటల సమయంలో ఆ సందేశాలను చూసిన హర్ష్‌ హతాశుడయ్యారు. తన ప్రమేయం లేకుండానే ఏకంగా రూ.కోటి పదిలక్షలు ఇతరుల ఖాతాకు బదిలీ కావడంతో తొలుత ఆందోళనకు గురైన ఆయన వెంటనే తేరుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో తొలుత బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. అంతటితో ఆగకుండా 10.22 గంటలకు 1930 నంబరుకు ఫోన్‌ చేసి జరిగిన మోసాన్ని వివరించారు.

బెంగళూరు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తింపు

నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌(ఎన్‌సీఆర్‌పీ) నేతృత్వంలోని సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజమెంట్‌ సిస్టమ్‌(సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. తెలంగాణలో ఈ మోసం జరగడంతో టీఎస్‌సీఎస్‌బీ కూడా అప్రమత్తమైంది. వెంటనే నగదు బదిలీ జరిగిన యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ప్రతినిధులను అప్రమత్తం చేసింది. అవన్నీ సత్ఫలితాన్నిచ్చాయి. సదరు సొమ్మును సైబర్‌ నేరస్థులు ఖాతాల నుంచి డ్రా చేయకుండా నిలిపేసినట్లు(పుట్‌ ఆన్‌ హోల్డ్‌) బాధితుడి చరవాణికి 10.42 గంటల సమయంలో సందేశం వచ్చింది. ‘అప్పటికి నేరస్థులు రూ.10 వేలు మాత్రమే డ్రా చేయగలిగారు. డబ్బు బెంగళూరులోని ఖాతాలకు బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలింది. అవి సజావుద్దీన్‌, సలీముద్దీన్‌ ఖాతాలుగా గుర్తించాం. బాధితుడి ప్రమేయం లేకుండా నగదు బదిలీ ఎలా జరిగిందని తెలుసుకునే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. డబ్బులు పోగొట్టుకున్న వెంటనే తేరుకుని ఫిర్యాదు చేయగలిగితే వెనక్కి తెచ్చేందుకు అవకాశముంటుందనేందుకు ఈ ఉదంతమే నిదర్శనం’ అని టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయెల్‌ పేర్కొన్నారు. ‘టీఎస్‌సీఎస్‌బీ యంత్రాంగం నాతో ఫోన్‌లో మాట్లాడుతూ సమాచారం తెలుసుకుంటున్న సమయంలోనే డబ్బు డ్రా చేయకుండా నిలిపేసినట్టు బ్యాంకు నుంచి సంక్షిప్త సందేశం వచ్చింది. మా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి’ అని బాధితుడు హర్ష్‌ పేర్కొన్నారు. టీఎస్‌సీఎస్‌బీ పనితీరును కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని