TS News: ప్రాణంతో ఉన్న పాడిగేదెల తొడలు కోసి..

మాంసం కోసం ప్రాణం ఉన్న పాడి పశువుల తొడలను నలుగురు యువకులు పదునైన కత్తులతో కోసిన క్రూర సంఘటన ఇది

Updated : 13 Jun 2021 11:57 IST

మాంసం కోసం కిరాతకం.. చనిపోయిన మూగజీవాలు
ఒక నిందితుడి అరెస్టు... ముగ్గురి పరారీ

కొండపాక, న్యూస్‌టుడే: మాంసం కోసం ప్రాణం ఉన్న పాడి పశువుల తొడలను నలుగురు యువకులు పదునైన కత్తులతో కోసిన క్రూర సంఘటన ఇది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల శివారులో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిరిసినగండ్ల-దమ్మకపల్లి గ్రామాల మధ్య రాజేందర్‌రెడ్డికి చెందిన వ్యవసాయక్షేత్రంలో నేపాల్‌కు చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు పని చేస్తున్నారు. రాజగిరి వెంకటేశం అనే రైతు శుక్రవారం సాయంత్రం పొలంలోని పాకలో ఉన్న తన గేదెల నుంచి పాలు పిండుకుని ఇంటికి వెళ్లిపోయాడు. నలుగురు యువకులు రాత్రి వేళ మాంసం కోసం రెండు గేదెల తొడ భాగాలను కోసేయడంతో అవి తీవ్ర రక్తస్రావమై చనిపోయాయి. శనివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు హతాశుడయ్యారు. గ్రామస్థులతో కలిసి గాలించగా వ్యవసాయక్షేత్రంలో నిందితులు కనిపించారు. మాంసాన్ని వండేందుకు సిద్ధం చేసుకుంటున్న వారిలో ముగ్గురు నిందితులు గ్రామస్థులను చూసి పారిపోయారు. నేపాలీ యువకుడు సందీప్‌ (25) పట్టుబడ్డాడు. అతడిని నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టాడు. సిద్దిపేట త్రీ టౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ కొమురయ్య ఆధ్వర్యంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని