ఆభరణాల దుకాణంలో కాల్పులు

రాజధాని హైదరాబాద్‌లో దొంగలు బరి తెగించారు. నాగోల్‌ పరిధిలోని ఆభరణాల దుకాణంలో బంగారం దోపిడీ చేయడంతో పాటు దాన్ని అడ్డుకొనేందుకు యత్నించిన ఇద్దరిపై కాల్పులు జరిపి పరారయ్యారు.

Updated : 02 Dec 2022 06:40 IST

బంగారు నగల దోపిడీ
 హైదరాబాద్‌లో ఘటన

ఈనాడు- హైదరాబాద్‌, కొత్తపేట, నాగోల్‌, న్యూస్‌టుడే: రాజధాని హైదరాబాద్‌లో దొంగలు బరి తెగించారు. నాగోల్‌ పరిధిలోని ఆభరణాల దుకాణంలో బంగారం దోపిడీ చేయడంతో పాటు దాన్ని అడ్డుకొనేందుకు యత్నించిన ఇద్దరిపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఘటనలో బంగారం వ్యాపారి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దుకాణం యజమాని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గురువారం పొద్దుపోయాక జరిగిన కాల్పుల ఘటన నగరంలో కలకలం సృష్టించింది.

మూడు రౌండ్ల కాల్పులు

రాజస్థాన్‌లోని పాలీ జిల్లా జైతరణ్‌ తహసీల్‌కు చెందిన కల్యాణ్‌ చౌదరి పదిహేనేళ్ల కిందట నగరానికి వచ్చారు. వనస్థలిపురంలో ఉంటూ చైతన్యపురి ఠాణా పరిధిలోని స్నేహపురి కాలనీలో 11 ఏళ్లుగా మహదేవ్‌ జ్యుయెలర్స్‌ పేరిట బంగారు, వెండి ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో దుకాణం మూసేయడానికి సిద్ధమవుతుండగా.. ఆభరణాల వ్యాపారి రాజ్‌కుమార్‌ సురానా సుఖ్‌దేవ్‌ సికింద్రాబాద్‌ నుంచి బంగారం తీసుకొచ్చారు. అప్పటికే ఆభరణాలు కొనేందుకు వచ్చిన ముగ్గురు వినియోగదారులు కల్యాణ్‌తో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో నలుగురు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు దుకాణానికి కొద్ది దూరంలో వాటిని నిలిపారు. అందులో ఇద్దరు దుకాణంలోకి ప్రవేశించారు. ఒకరు హెల్మెట్‌, మరొకరు మాస్క్‌ ధరించి ఉన్నారు. అందులో ఒకరు దేశవాళీ తుపాకీతో బెదిరిస్తూ దుకాణంలో ఉన్న ముగ్గురు వినియోగదారుల్ని బలవంతంగా బయటకు నెట్టేసి షట్టర్‌ మూసేశారు. వ్యాపారి సుఖ్‌దేవ్‌  తీసుకొచ్చిన బంగారం, దుకాణంలోని ఆభరణాలు ఇవ్వాలంటూ తీవ్రంగా బెదిరించారు. నలుగురి మధ్య కొద్దిసేపు పెనుగులాట జరిగింది. మూడు   రౌండ్లు కాల్పులు జరిపారు. సుఖ్‌దేవ్‌కు చెవి, భుజం దగ్గర రెండు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. కల్యాణ్‌కు ముక్కు దగ్గర బుల్లెట్‌ గాయమైంది. ఇద్దరూ రక్తం మడుగులో కిందపడ్డారు.

గురువారం బంగారం తెస్తారని తెలిసే...

దుండగులు పక్కా ప్రణాళిక ప్రకారమే దోపిడీకి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారి సుఖ్‌దేవ్‌ ప్రతి గురువారం కల్యాణ్‌ దుకాణానికి వచ్చి బంగారం ఇస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నిందితులు సుఖ్‌దేవ్‌ను అనుసరించి దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు సీసీ పుటేజీలను క్షుణ్నంగా పరిశీలించారు. నిందితులు వెళ్లిన మార్గాన్ని డాగ్‌ స్క్వాడ్‌ గుర్తించింది.


బంగారంతో పరార్‌..

దుండగులు లోపలికి వెళ్లాక ఒక్కసారిగా తుపాకీ శబ్దం రావడంతో బయట నిలబడ్డ ముగ్గురు వినియోగదారులు షట్టర్‌ తెరిచారు. ఇద్దరు దుండగులు నగల వ్యాపారి దగ్గరున్న బంగారం సంచి, దుకాణంలో నగదు లాక్కుని బయటకు వచ్చి, సిద్ధంగా ఉన్న మిగతా ఇద్దరు వ్యక్తులతో కలిసి ద్విచక్రవాహనాలపై వెళ్లిపోయారు. అంతా రెండు నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని