Crime News: ఓర్వకల్లులో దారుణం.. గొంతు కోసి.. రాళ్లతో తలపై మోది తోడికోడళ్ల దారుణహత్య

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు తోడికోడళ్లను దారుణంగా హత్య చేశారు.

Published : 14 Dec 2022 23:04 IST

ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరుకు చెందిన తోడికోడళ్లు రేణుక(21), రామేశ్వరి(26) దారుణహత్యకు గురయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దరామ గోవిందు, చిన్నరామ గోవిందు ఇద్దరు అన్నదమ్ములు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్దరామ గోవిందు భార్య రామేశ్వరి, చిన్నరామ గోవిందు భార్య రేణుక కలిసి పశువుల మేత కోసం గ్రామ సమీపంలోని ఓ పొలంలో పశుగ్రాసం కోసేందుకు వెళ్లారు. అదే సమయంలో గుర్తు తెలియని దుండగులు వారిపై దాడి చేశారు. వారిద్దరి గొంతు కోసి రాళ్లతో తలపై బాది ఇద్దరినీ దారుణంగా హత్య చేశారు.

ఎంతసేపటికీ వారు ఇంటికి రాకపోవడంతో సోదరులిద్దరూ ఇవాళ సాయంత్రం 6గంటలకు పొలం వద్దకు వెళ్లి చూశారు. రామేశ్వరి, రేణుక రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరయ్యారు. సోదరులిద్దరూ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దిశ డీఎస్పీ వెంకటరామయ్య, కర్నూలు గ్రామీణ సీఐ శ్రీనివాసుల రెడ్డి, ఎస్సై మల్లికార్జున ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని