తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు

ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లలను, కన్నతల్లిని కడతేర్చి తానూ ఉరివేసుకుని తనువు చాలించారు.

Updated : 01 May 2024 06:49 IST

ఆర్థిక ఇబ్బందులు తాళలేక అఘాయిత్యం
ఐదుగురి విషాదాంతం.. విజయవాడలో సంచలనం

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - పటమట: ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లలను, కన్నతల్లిని కడతేర్చి తానూ ఉరివేసుకుని తనువు చాలించారు. సొంతంగా ఆసుపత్రిని ప్రారంభించే ప్రయత్నాల్లో అప్పులపాలు కావడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. విజయవాడ నగరం పటమటలో సంచలనం సృష్టించిన ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగుచూసింది. పటమట వాసవీనగర్‌కు చెందిన ధరావత్‌ శ్రీనివాస్‌ (40) ఎముకల వైద్యుడు. భార్య ఉష (38), కుమార్తె శైలజ (9), కుమారుడు శ్రీహన్‌ (5), తల్లి రమణమ్మ (65)తో పాటు ఉంటున్నారు. తండ్రి జమలయ్య నాయక్‌ పోలీసు శాఖలో పని చేసి, పదేళ్ల కిందట మరణించారు. శ్రీనివాస్‌ సోదరుడు దుర్గాప్రసాద్‌ హైదరాబాద్‌లో న్యాయాధికారిగా పని చేస్తున్నారు. చెల్లెలు లక్ష్మికి వివాహం అయింది. వీరి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు. వైద్యుడైన శ్రీనివాస్‌ సొంతంగా ఆసుపత్రి ప్రారంభించేందుకు గత ఏడాది ఓ భవనాన్ని లీజుకు తీసుకున్నారు. సుమారు రూ. 3 కోట్ల మేర వెచ్చించినా.. పనులు పూర్తికాక అది వినియోగంలోకి రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన స్నేహితులు కొందరు భాగస్థులుగా చేరారని, వారు శ్రీనివాస్‌ను మోసగించి రోడ్డున పడేశారని బంధువులు చెబుతున్నారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు నమ్మిన వారు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక రెండు నెలలుగా ఆయన కుంగుబాటులో ఉన్నారు. అందరినీ చంపి, తాను కూడా ప్రాణం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. వీరి పాప ఆటిజం సమస్యతో బాధపడుతోంది. సోమవారం అర్ధరాత్రి దాటాక.. శ్రీనివాస్‌ వేర్వేరు గదుల్లో నిద్రపోతున్న తల్లి, భార్య, పిల్లలను చాకుతో మెడ భాగంలో కోసేశారు. కొద్దిసేపట్లోనే వారంతా చనిపోయారు.

నగదు, బంగారం కారులో పెట్టి..

అనంతరం మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో.. ఇంట్లో నగదు, బంగారాన్ని ఓ బ్యాగులో సర్దిన శ్రీనివాస్‌, దానిని తన కారులో ఉంచారు. కారు తాళానికి కాగితం చుట్టి ఎదురింటి గేటుకు ఉన్న పెట్టెలో వేశారు. అదేమిటని అడిగితే, తాను ఊరు వెళ్తున్నానని.. అన్నయ్య వస్తే కారు తాళం ఇవ్వమని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఉదయం 9.30 గంటలకు పనిమనిషి వచ్చి పిలిచినా పలకలేదు. గోడపై నుంచి చూడగా పోర్టికోలో శ్రీనివాస్‌ ఉరేసుకుని కనిపించారు. స్థానికులు వచ్చి చూసేసరికే శ్రీనివాస్‌ ప్రాణాలు వదిలారు. ఎదురింటివారు కారు తాళానికి చుట్టిన కాగితం తీసి చూడగా.. తన సోదరుడైన న్యాయాధికారి దుర్గప్రసాద్‌కు మాత్రమే ఇవ్వమని, ఆయన ఫోన్‌ నంబరు రాసి ఉంది. వారు ఆయనకు ఫోన్‌ చేసి తెలపగా, ఆయన పోలీసులకు సమాచారం అందజేశారు. శ్రీనివాస్‌ పోర్టికోలో ఉరేసుకుని మృతి చెందగా, లోపల వేర్వేరు గదుల్లో ఆయన తల్లి, భార్య, కుమార్తె, కుమారుడి మృతదేహాలు పడి ఉన్నాయి. శ్రీనివాస్‌ తన ఫోన్‌లో వాయిస్‌ను రికార్డ్‌ చేసి ఉంచారు. అందులో కారులో ఉంచిన నగదు, నగలను తన అన్న దుర్గాప్రసాద్‌కు ఇవ్వమని ఉంది. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు రికార్డ్‌ చేశారు. పోలీసులు కారులో ఉన్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రూ. 16 లక్షల నగదు, 300 గ్రాముల బంగారం ఉన్నట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని