logo

విడిచి ఉండలేక.. కలిసి బతకలేక

వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో సంతోషించారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని.. అన్యోన్యంగా జీవించాలని ఆశపడ్డారు

Updated : 14 Mar 2024 07:53 IST

 ఉరేసుకుని ప్రియురాలు.. పురుగుమందు తాగి ప్రియుడి ఆత్మహత్య

మందమర్రి పట్టణం, నెన్నెల న్యూస్‌టుడే: వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో సంతోషించారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని.. అన్యోన్యంగా జీవించాలని ఆశపడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో ప్రియురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రియుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల మండలం చిత్తపూర్‌ గ్రామానికి చెందిన తీగుళ్ల భగవాన్‌(23), మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన సంగీత(21)ల మధ్య పాఠశాల స్థాయిలోనే ప్రేమ చిగురించింది. ఆమె రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. భగవాన్‌ డీసీఎం వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.  కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించారు. బుధవారం ఉదయం తన అక్క కొడుకు చిన్నారి వియాన్ష్‌కు భోజనం తినిపించే విషయమై సంగీత చిరాకు పడింది. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. అనంతరం కూలీ పనికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎవరితోనో ఫోన్‌ మాట్లాడిన ఆమె ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చి చూసిన బంధువులు అచేతన స్థితిలో ఉన్న సంగీతను చూసి కిందికి దించారు. వెంటనే మందమర్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందింది. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో కొన్ని రోజులుగా గొడవ జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. భగవాన్‌ డీసీఎం వ్యాన్‌లో పత్తిలోడును కుమురంభీం జిల్లా రేపల్లివాడ జిన్నింగ్‌ మిల్లుకు తీసుకెళ్లి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం అయ్యాడు. బెల్లంపల్లికి చేరుకోగానే సంగీత మృతి చెందిన విషయం తెలిసింది. వెంటనే పురుగుమందు కొనుగోలు చేసి బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లి గ్రామ సమీపంలోని మామిడితోట వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న సోదరుడు భరత్‌ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. దారి వెంట వెతుకుతూ వెళ్లగా రహదారిపై వ్యాన్‌ కనిపించింది. పక్కనే ఉన్న మామిడితోటలో అపస్మారక స్థితిలో భగవాన్‌ కనిపించారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అదే డీసీఎం వ్యాన్‌లో తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందారని వైద్యులు చెప్పారు. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని భగవాన్‌ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాళ్లగురిజాల ఎస్సై నరేష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని