logo

గోస తీర్చాలి.. బాసటగా నిలవాలి

పేదరికాన్ని దూరం చేసుకుందామని.. కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలని.. తలకు మించిన అప్పులు చేసి కోటి ఆశలతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారికి చివరకు కష్టాలు.. కన్నీళ్లు మిగులుతున్నాయి.

Updated : 04 May 2024 06:41 IST

ఉమ్మడి జిల్లాలో గల్ఫ్‌ కార్మికుల బతుకు భారం
నిర్మల్‌, న్యూస్‌టుడే

పేదరికాన్ని దూరం చేసుకుందామని.. కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలని.. తలకు మించిన అప్పులు చేసి కోటి ఆశలతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారికి చివరకు కష్టాలు.. కన్నీళ్లు మిగులుతున్నాయి. తినడానికి తిండిలేక, ఉండటానికి గూడులేక, అక్కడ పనిదొరక్క, అక్కడి ప్రభుత్వాలు విధించిన చట్టాల కారణంగా కొందరు రెక్కలు విరిగిన పక్షుల్లా స్వగ్రామాలకు చేరుతుండగా.. మరికొందరు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయి గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇంకొందరు అజ్ఞాతవాసంలో ఉంటున్నారు. ప్రభుత్వాలు గల్ఫ్‌లో ఉన్న వారితోపాటు తిరిగొచ్చిన బాధితులు, వారి కుటుంబాలను  పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలు తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది గల్ఫ్‌ దేశాలకు వెళ్లగా.. తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారే ఆయా దేశాలకు వెళ్తుండటంతో వారంతా భవన నిర్మాణం, వ్యవసాయం వంటి పనుల్లో కుదురుతున్నారు. అక్కడి వాతావరణం, ఆహారం, తదితర పరిస్థితుల కారణంగా మానసిక ఒత్తిడితో అనారోగ్యం, ఆపై మృత్యువాత పడుతున్న వారు కొందరైతే.. క్షణికావేశాలతో చేసే నేరాలతో జైళ్ల పాలవుతున్న వారు మరికొందరు. పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గల్ఫ్‌ బాధిత కుటుంబాల ఓట్లు కీలకం కానున్నాయి. ముఖ్యంగా నిర్మల్‌ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 1,96,400 మంది గల్ఫ్‌ బాధిత కుటుంబాల ఓటర్లు ఉండగా.. మిగతా మూడు జిల్లాలైన మంచిర్యాల, ఆదిలాబాద్‌, కుమురంభీంలలో 60 వేల మంది వరకు ఉంటారని గల్ఫ్‌ కార్మిక సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లలో గల్ఫ్‌ బాధిత కుటుంబ సభ్యులు 11.5 శాతం మంది ఉన్నారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం తమ గోడు తీర్చాలని గల్ఫ్‌ బాధితులు వేడుకుంటున్నారు.

గల్ఫ్‌లో పనిచేయడానికి వెళ్తున్న కార్మికులు

ఉమ్మడి జిల్లాలో గల్ఫ్‌ కార్మికుల కుటుంబ సభ్యులు : 2,56,400

గల్ఫ్‌ బాధితుల సమస్యలపై పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో గల్ఫ్‌ కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. కేరళ తరహాలో ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ప్రజాభవన్‌లో ప్రత్యేక కార్యాలయం, సెప్టెంబరు 17లోగా గల్ఫ్‌ బాధితుల సంక్షేమం కోసం పకడ్బందీ వ్యవస్థ, గల్ఫ్‌ దేశాల్లో మృతిచెందిన కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అమలు, తదితర డిమాండ్లపై చర్చించారు. గల్ఫ్‌ కార్మికుల సమస్యలు తీరుతాయని బాధిత కుటుంబ సభ్యులు ఆశలు పెట్టుకున్నారు. 

ఇవీ డిమాండ్లు

  • గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వార్షిక బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించాలి
  • కేరళ తరహాలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి
  • గల్ఫ్‌ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, జీవిత, ప్రమద బీమా, పెన్షన్‌లతో కూడిన సాంఘిక భద్రత పథకం అమలు చేయాలి
  • గల్ఫ్‌ దేశాల్లోని జైళ్లలో చిక్కుకున్న వారికి మెరుగైన న్యాయ సహాయం అందించాలి
  • కేంద్రం తరపున వెంటనే హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ, కువైట్‌ కాన్సులేట్లను ఏర్పాటు చేయాలి
  • గల్ఫ్‌ బాధిత కుటుంబాల పిల్లల కోసం రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయిస్తూ రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలి.
  • గల్ఫ్‌లో ఉపాధి పొందుతూ ప్రమాదాల వల్ల ఆరోగ్యం దెబ్బతిన్న వారికి ప్రభుత్వం ద్వారా వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేయాలి. గల్ఫ్‌లో మరణించిన వారి మృతదేహాలను తెప్పించడానికి ప్రభుత్వం చొరవ చూపించాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని