logo

నిలబడు.. కలబడు

ప్రభుత్వంతో.. ఉద్యోగులతో పని చేయించుకోవడం ప్రజల హక్కు.. దాన్ని లంచంతో కొనొద్దు.. ఇది సినిమా డైలాగు. నేటి సమాజంలో ప్రతిఒక్కరికీ ఏదో రూపంలో అవినీతి పలకరిస్తోంది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల

Published : 09 Dec 2021 04:08 IST

నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం

న్యూస్‌టుడే- అమరావతి ఫీచర్స్‌, చిట్టినగర్‌

ఇలాంటి బోర్డులే కాదు ఆచరణ అన్ని కార్యాలయాల్లో ఉండాలి..

ప్రభుత్వంతో.. ఉద్యోగులతో పని చేయించుకోవడం ప్రజల హక్కు.. దాన్ని లంచంతో కొనొద్దు.. ఇది సినిమా డైలాగు. నేటి సమాజంలో ప్రతిఒక్కరికీ ఏదో రూపంలో అవినీతి పలకరిస్తోంది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నుంచి దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు, స్థలాలపై హక్కులు.. ఇంటికి విద్యుత్తు కనెక్షన్‌, నీటి కనెక్షన్‌ ఇవ్వాలన్నా.. పన్ను వేయాలన్నా.. దాన్ని తగ్గించాలన్నా.. మలి వయసులో ఆసరా పొందాలన్నా లంచం పుచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అవినీతిపై నిగ్గదీసి, ప్రశ్నించి విజయం సాధించేవారూ ఉన్నారు... నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ అంశాలన్నింటీనీ ఓ సారి గుర్తు చేసుకుందాం.

ఆయన అలా..  అతడు ఇలా..

సత్తెనపల్లి మండలంలోని ఫణిదంలో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారి ప్రతి పనికీ డబ్బులు వసూలు చేస్తుండటాన్ని స్థానిక యువకుడు ప్రశ్నించాడు. అతడిలో మార్పు రాకపోవడంతో ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించి పట్టించాడు. ఉద్యోగం పోయి రెవెన్యూ ఉద్యోగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనారోగ్యంపాలై ఆసుపత్రుల్లో చూపించుకునేందుకు కూడా డబ్బుల్లేని దయనీయస్థితికి చేరాడు. అదే అవినీతిని ప్రశ్నించిన యువకుడు దేశభక్తితో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సాధించి ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ఇలా అవినీతి ముద్రతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎంతోమంది ఉద్యోగులు తమ విలువైన జీవితాల్ని చీకటిమయం చేసుకోగా వారిని పట్టిచ్చిన సామాన్యులు సమాజంలో గౌరవం పొందారు.

ఓనమాలు దిద్దిన బడికే..

ఆరేళ్లక్రితం సత్తెనపల్లి జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్మాణ పనుల టెండరు దక్కింది. రూ.5.50 లక్షల నిధులతో చేపట్టాల్సిన పనుల్లో సగం పూర్తయ్యాయి. నిర్మాణ పనులకు విద్యుత్తు వాడుకున్నందుకు రూ.18 వేలు లంచంగా ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. వంటగది నిర్మాణానికి రూ.1.75 లక్షలు మంజూరైతే దానికి పర్సంటేజి కావాలని అడిగారు. దీంతో రూ.16 వేలు లంచం ఇస్తానని హెచ్‌ఏంకు చెప్పి ఏసీబీ అధికారులను ఆశ్రయించి పట్టిచ్చా. శాఖాపరమైన విచారణ పేరుతో ఆ కేసును సాగదీస్తున్నారు. రాజీకి రావాలని నన్ను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినా నేను ఒప్పుకోలేదు. అవినీతి భరతం పట్టేందుకు నేను నిజాయతీగా చివరివరకు నిలబడతా.

- వంకాయలపాటి శ్రీనివాసచక్రవర్తి, నార్నెపాడు.

తోటి ఉద్యోగి అనే  కనికరం లేదాయె..

మా నాన్న చావపాటి నాగుల్‌మీరా పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసి మేలో చనిపోయారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందేందుకు రెవెన్యూశాఖ నుంచి ధ్రువీకరణ పత్రాలు అవసరమయ్యాయి. అవి ఇవ్వాలని వీఆర్‌వో కిషోర్‌బాబును సంప్రదిస్తే మధ్యవర్తి వద్దకు వెళ్లాలని చెప్పారు. వారిద్దరూ మాట్లాడుకుని రూ.90  వేలు లంచంగా ఇస్తే అన్ని ధ్రువపత్రాలు ఇస్తామన్నారు. తోటి ఉద్యోగి అనే కనికరం లేకపోవడం ఆగ్రహం తెప్పించింది. ఏసీబీ అధికారుల్ని సంప్రదించి వీఆర్‌వోను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టిచ్చా.

- చావపాటి షమీముల్లా, మేడికొండూరు.

లంచం అడిగితే అంతే..

విజయవాడ చిట్టినగర్‌కు చెందిన శివ అనే వ్యక్తి ముగ్గురు అధికారులను ఏసీబీకి పట్టించాడు. గతంలో ఓ పాఠశాల ప్రభుత్వ గుర్తింపు కోసం విద్యాశాఖాధికారిని ఆశ్రయించాడు. అందుకు ఆ అధికారి లంచం డిమాండు చేయడంతో ఏసీబీతో పట్టించాడు. చిట్టినగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యుత్తు కనెక్షను నిమిత్తం లైన్‌మెన్‌ను లంచం అడిగాడు. లైన్‌మెన్‌నూ పట్టించాడు. నగర శివారు ప్రాంతమైన అంబాపురం గ్రామంలో అతని మిత్రుడు చిన్నతరహా పరిశ్రమ పెట్టుకునేందుకు ఆ గ్రామ పంచాయతీని అనుమతి కోరగా కార్యదర్శి లంచం అడిగితే పట్టించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని