రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

నియోజకవర్గంలోని రాయదుర్గం- బళ్లారి ర.భ అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిలోని డి.హీరేహాళ్‌ మండలం కల్యం గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Updated : 09 Aug 2022 05:32 IST

కల్యం, డి.హీరేహాళ్‌, (రాయదుర్గం గ్రామీణం), న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని రాయదుర్గం- బళ్లారి ర.భ అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిలోని డి.హీరేహాళ్‌ మండలం కల్యం గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. చీకట్లో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాయదుర్గం పట్టణం జేఆర్‌ఎస్‌ కాలనీలో నివాసం ఉంటున్న మహమ్మద్‌ రఫీక్‌ (37), డి.హీరేహాళ్‌ మండలం మురడి గ్రామానికి చెందిన అశోక్‌ (26) మృతి చెందారు. రాయదుర్గం పట్టణానికి చెందిన సాగర్‌, రవి, మురడి గ్రామానికి చెందిన రామాంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. రఫీక్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బళ్లారిలో పాలిష్‌ బండలు ఏర్పాటు చేసే పనులు ముగించుకుని స్నేహితుడు సాగర్‌తో కలిసి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మొహర్రం సందర్భంగా అశోక్‌ స్నేహితులు రామాంజనేయులు, రవితో కలిసి రాయదుర్గం పట్టణంలో సరకులు తీసుకొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డి.హీరేహాళ్‌ ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి పోలీసులతో ఘటనా స్థలాన్ని సందర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని