logo

కథ.. కంచెకి..!

మొక్క నాటగానే సంబరం కాదు.. నీళ్లుపోయాలి.. ఎదిగే వరకు సంరక్షించాలి. వృక్షంలా మారాలి.. పదుగురికి నీడనిస్తే.. మేలుచేస్తే.. అప్పుడు లక్ష్యం నెరవేరినట్లు. జిల్లాలో పచ్చదనం అభివృద్ధి, సంరక్షణకు రూ.కోట్లు కరుగుతున్నా.. మొక్కల

Published : 05 Dec 2021 06:26 IST

 నాసిరకం ప్లాస్టిక్‌ ట్రీగార్డులకు చెక్‌ 
 ముళ్లకంచెలు.. కొబ్బరి మట్టలతోనే రక్షణ

ఈనాడు - కాకినాడ మొక్క నాటగానే సంబరం కాదు.. నీళ్లుపోయాలి.. ఎదిగే వరకు సంరక్షించాలి. వృక్షంలా మారాలి.. పదుగురికి నీడనిస్తే.. మేలుచేస్తే.. అప్పుడు లక్ష్యం నెరవేరినట్లు. జిల్లాలో పచ్చదనం అభివృద్ధి, సంరక్షణకు రూ.కోట్లు కరుగుతున్నా.. మొక్కల ఆలనాపాలన కరవవుతోంది. దీంతో చాలాచోట్ల మొక్కలు ఎండి మాయం అవుతున్నాయి. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం పచ్చతోరణంలో నాటిన మొక్కలది చాలాచోట్ల ఇదే పరిస్థితి. రక్షణ కంచెలు కొన్నిచోట్ల నాసిగా ఏర్పాటుచేస్తే నెలలు గడవక ముందే దెబ్బతిన్నాయి. మరికొన్నిచోట్ల ముళ్ల కంచెలు అడ్డుపెడితే అవీ రక్షించలేకపోతున్నాయి. ఇంకొన్నిచోట్ల ఆ ఊసే లేక మొక్కల 
మనుగడ ప్రశ్నార్థకమైంది.

*జిల్లాలో ఏటా అటవీశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో పచ్చదనం అభివృద్ధి పనులు చేపడుతున్నారు. డ్వామా ద్వారా ఉపాధి హామీ నిధులతో జగనన్న పచ్చతోరణం కింద ఈ ఏడాది దారులకు ఇరువైపులా మొక్కలు నాటారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఉద్యాన, పూల వనాలకు ఊతమిచ్చారు. ఈ పనుల్లో చాలాచోట్ల పర్యవేక్షణ లోపం దర్శనమిస్తోంది. 

ఇదేం తీరండి.. 
పెద్దాపురం: జె.తిమ్మాపురంలో మొక్కలకు రక్షణ కంచెలు ఇలా..
* పచ్చతోరణం సీజన్‌ అక్టోబరు ఆఖరుతో ముగిసింది. వీటి నిర్వహణ మాత్రం రెండేళ్లు కొనసాగుతుంది. మొక్కల కొరత, ఇతర సాంకేతిక కారణాలతో నిర్దేశిత లక్ష్యాలు చేరలేకపోయారు. కనీసం నాటిన మొక్కలు సకాలంలో సంరక్షించలేని పరిస్థితి. 
* జిల్లాలో 6.12 లక్షల ట్రీ గార్డుల సరఫరా బాధ్యతను గతంలో ఓ గుత్తేదారుకు అప్పగిస్తే.. సరఫరా చేయలేక చేతులెత్తేశారు. దీంతో ఈ బాధ్యత కొందరికి అప్పగించారు. ఈ ప్రక్రియా మధ్యలో ఆగింది. ఎట్టకేలకు కూలీలను పెట్టి తాత్కాలిక కంచెలు ఏర్పాటుచేశారు.


కాకినాడ గ్రామీణంలో ఇలా.. 

* ప్లాస్టిక్‌ జాలీ తరహాలో హెచ్‌డీపీసీ ట్రీగార్డులను తొలుత ఏర్పాటుచేశారు. ఒక్కో ట్రీగార్డుకు అప్పట్లో రూ.138 వెచ్చించారు. 78 వేల ట్రీగార్డులు ఏర్పాటు చేశాక.. క్షేత్రంలో పరిశీలించిన కేంద్ర బృందం అభ్యంతరం తెలిపింది. దీంతో వీటి ఏర్పాటును ఆపేశారు. అంత ఖరీదులేని ఈ ట్రీగార్డులు నాణ్యత లేమితో చాలావరకు కొద్దిరోజులకే దెబ్బతిన్నాయి.
* మొక్కల రక్షణకు ముళ్ల కంచెలు, కొబ్బరి మట్టలు, వస్త్రాలతో రక్షణ కల్పించే చర్యలు చేపట్టారు. కర్రలు, వస్త్రాలు, ముళ్ల కంచెలతోపాటు కూలి కోసం ఒక్కో ట్రీ గార్డుకు రూ.140 వెచ్చించారు. సామగ్రి, వేతనాల కింద రూ.75 చూపారు. కొన్నిచోట్ల ఈ పనులు సాగినా.. చాలాచోట్ల మమ అనిపించడంతో మొక్కలు జీవాలకు ఆహారంగా మారాయి.

మేల్కొంటే మేలు..
* నిరుడు ఎవెన్యూ ప్లాంటేషన్, ఉద్యాన మొక్కల పెంపకానికి రూ.5.6 కోట్లు ఖర్చుచేస్తే.. 
85 శాతం మొక్కల్నే రక్షించగలిగారు. ఈసారి ఒక్కో మొక్కకు రూ.74 వెచ్చించినా లక్ష్యం చేరలేదు సరికదా.. నాటిన తక్కువ మొక్కలను సైతం రక్షించుకోలేని పరిస్థితి నెలకొంది.నీ సôరక్షణను పంచాయతీలకు అప్పగించారు. ప్రతి 200 మొక్కలకు ఒక వాచ్‌మెన్‌ చొప్పున నియమించారు. కి.మీ.కి... నెలకు రూ.2 వేలు (పర్యవేక్షణకు), నీరు పోయడానికి రూ.8వేలు ఇస్తున్నారు. చెల్లింపుల జాప్యంతో.. రక్షణ, పర్యవేక్షణ కరవైంది.

మొక్కల సంరక్షణపై దృష్టి
ఉద్యానాల కింద 3,237 ఎకరాల్లో, ఎవెన్యూ ప్లాంటేషన్‌ కింద 1,446 కి.మీ పరిధిలో మొక్కలు నాటాం.  సంరక్షకులను నియమించాం. నీటి తడులకు ఏర్పాట్లు చేశాం. మొక్కలకు ప్లాస్టిక్‌ గార్డులు వద్దని ఎంవోఆర్డీ బృందం చెప్పడంతో ఆపేశాం. కట్టెలు, వస్త్రాలతో ట్రీగార్డులు ఏర్పాటుచేశాం. ఎన్‌ఐసీలోని సాఫ్ట్‌వేర్‌ మారడంతో చెల్లింపుల్లో జాప్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక చెల్లింపులు, మొక్కలపై పర్యవేక్షణ పెంచుతాం. -ఎ.వెంకటలక్ష్మి, పీడీ, డ్వామా 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని