logo

కొత్తందాలు.. పర్యాటక సొబగులు

భాగ్యనగరానికి మరిన్ని పర్యాటక సొబగులు జత చేరనున్నాయి. నగరానికి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునే విధంగా సరికొత్త ప్రాజెక్టులతో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ముందుకు వస్తోంది.

Published : 27 Jan 2023 03:49 IST

ముస్తాబవుతున్న సైకిల్‌ ట్రాక్‌

ఈనాడు, హైదరాబాద్‌: భాగ్యనగరానికి మరిన్ని పర్యాటక సొబగులు జత చేరనున్నాయి. నగరానికి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునే విధంగా సరికొత్త ప్రాజెక్టులతో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ముందుకు వస్తోంది. హుస్సేన్‌సాగర్‌ వద్ద ఫిబ్రవరి 11న అంతర్జాతీయ ఫార్ములా-ఈ పోటీలు జరగనున్న దృష్ట్యా.. సాగర్‌ చుట్టూ కొత్త అందాలు అద్దుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సాగర్‌లో మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌, లేజర్‌ షో అందుబాటులోకి తెచ్చేందుకు పనులు సాగుతున్నాయి. తాజాగా నెక్లెస్‌రోడ్డులో వేలాడే వంతెన పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.  అవుటర్‌పై కూడా సైకిల్‌ ట్రాక్‌ పనులు తుదిదశకు చేరాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా గురువారు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

అవుటర్‌కే కొత్తరూపు.. తొలి విడతలో 23 కిలోమీటర్లలో చేపడుతున్న సైకిల్‌ ట్రాక్‌ అవుటర్‌కే కొత్త రూపు తీసుకొస్తోంది. తొలుత నానక్‌రాంగూడ నుంచి టీఎస్‌పీఎస్‌ వరకు 8.50 కిలోమీటర్లు.. నార్సింగ్‌ నుంచి కొల్లూరు వరకు మరో 14.50 కిలోమీటర్ల మేరకు సర్వీసు రోడ్లకు ఇరువైపులా ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 15 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ట్రాక్‌ 4.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. రెండు వైపులా 1 మీటర్‌ వెడల్పుతో పచ్చదనం కోసం కేటాయిస్తారు.  ట్రాక్‌ మొత్తం సోలార్‌ ప్యానల్స్‌ను పైకప్పుగా వాడుతున్నారు. సోలార్‌ ప్యానల్స్‌ నుంచి ఉత్పత్తి అయ్యే 16 మెగావాట్ల విద్యుత్తును అక్కడే వినియోగించనున్నారు. సీసీ కెమెరాల నిఘా పెట్టనున్నారు.

గాలిలో తేలినట్లు.. నెక్లెస్‌ రోడ్డులో ఎకో పార్కుతోపాటు యూ ఆకారంలో ఒక వేలాడే వంతెన సాగర్‌ లోపల వరకు నిర్మించారు. ఇందుకు రూ.15 కోట్లు నిధులు కేటాయించారు. ఈ వంతెనపై నిలబడితే జలాలపై తేలియాడినట్లు అనుభూతి కలగనుంది. ప్రస్తుతం వంతెన నిర్మాణం పూర్తి చేశారు. గార్డెనింగ్‌ పనులు జరుగుతున్నాయి. మరో పది రోజుల్లో అందుబాటులోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని