Hyderabad: సిగ్నల్‌ ఫ్రీగా ఎల్బీనగర్‌.. కూడలికి శ్రీకాంతాచారి పేరు : కేటీఆర్‌

ఎల్బీనగర్‌ కూడలిలో రూ.32 కోట్లతో నిర్మించిన హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్లే ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఎల్బీనగర్‌ కూడలికి శ్రీకాంతాచారి పేరు పెట్టనున్నట్లు తెలిపారు. 

Updated : 25 Mar 2023 18:13 IST

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ కూడలిలో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. రూ.32 కోట్లతో నిర్మించిన హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌వైపు వెళ్లే ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తాజాగా రెండో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో.. ఎల్బీనగర్‌ కూడలి సిగ్నల్‌ ఫ్రీగా మారింది. ఓ ఫ్లైఓవర్‌, 2 అండర్‌పాస్‌లు గతంలోనే అందుబాటులోకి వచ్చాయి. ఫ్లైఓవర్‌ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన 35వ ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు. మరో 12 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.

‘‘ ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోనే 12 పనులు చేపట్టాం. ఇప్పటికే 9 ప్రాజెక్టులు పూర్తికాగా.. మిగతా 3 ఫ్లై ఓవర్లను సెప్టెంబరు లోపు పూర్తి చేసి ప్రారంభిస్తాం. నాగోల్‌ మెట్రోను దిల్‌సుఖ్‌నగర్‌ లైన్‌తో అనుసంధానం చేస్తాం. ఎన్నికల తర్వాత మెట్రోను హయత్‌నగర్‌ వరకు విస్తరిస్తాం. ఎల్బీనగర్‌ మెట్రో మార్గాన్ని విమానాశ్రయంతో అనుసంధానిస్తాం. ఏడాదిన్నరలోపే కొత్తపేట మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేస్తాం. జీవో 58, 59 కింద ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను క్రమబద్ధీకరిస్తున్నాం’’ అని కేటీఆర్‌ అన్నారు. ఎల్బీనగర్‌ కూడలికి తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరు పెడతామని కేటీఆర్‌ చెప్పారు. ఈ మేరకు త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని