logo

హైదరాబాద్‌లో దారుణం: ఆడపిల్లని చేరదీసి.. అంగడిబొమ్మగా చేసి..

ఎవరూ లేని ఓ చిన్నారిని చేరదీసిన మహిళ.. ఆమెను పెంచి, పోషించి చివరికి వ్యభిచార కూపంలోకి దింపింది.

Updated : 09 May 2024 09:45 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఎవరూ లేని ఓ చిన్నారిని చేరదీసిన మహిళ.. ఆమెను పెంచి, పోషించి చివరికి వ్యభిచార కూపంలోకి దింపింది. యూసుఫ్‌గూడలో పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఓ ఇంటిపై దాడి చేయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీకృష్ణనగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పశ్చిమ మండల టాస్క్‌పోర్స్‌ పోలీసులు దాడి చేశారు. పాతికేళ్లు ఉన్న ఇద్దరు యువతులతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో తనిఖీ చేయగా 14 ఏళ్ల బాలిక కనిపించింది. ఆమెను బాలిక సంరక్షణ విభాగ అధికారులకు అప్పగించి కౌన్సెలింగ్‌ చేశారు.

నిర్వాహకురాలు లక్ష్మికి చిన్నప్పుడే దొరికితే తీసుకొచ్చిందని బాలిక అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. ఏడాది నుంచి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించిందని, తాను ఒప్పుకోకపోతే తీవ్రంగా దాడి చేసేదని.. తాడుతో బంధించేదని, మాట వినలేదని జుత్తు మొత్తం కత్తిరించిందని ఆవేదన వ్యక్తం చేసింది.  అనంతరం అధికారులు బాలికను జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. లక్ష్మిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. రహ్మత్‌నగర్‌లో తనకు చిన్నారి దొరికిందని, తీసుకొచ్చి పెంచుకున్నట్లు ఆమె వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని