logo

రెండో రోజు నలుగురు నామినేషన్‌

కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం కేవలం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్‌ స్థానం కోసం భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ తరఫున ఆ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు.

Published : 20 Apr 2024 05:05 IST

కాంగ్రెస్‌ పెద్దపల్లి అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తున్న గడ్డం వంశీకృష్ణ, చిత్రంలో ఎమ్మెల్యే విజయరమణారావు, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తదితరులు


ఈనాడు, కరీంనగర్‌ న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం కేవలం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్‌ స్థానం కోసం భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ తరఫున ఆ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. మరోవైపు పెద్దపల్లి లోక్‌సభ స్థానం కోసం ముగ్గురు నామినేషన్లు వేశారు. భారాస తరపున కొప్పుల ఈశ్వర్‌, కాంగ్రెస్‌ తరపున గడ్డం వంశీకృష్ణ నామినేషన్‌ దాఖలు చేశారు. కరీంనగర్‌లో భాజపా అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ తరపున భాజపా కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగిడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, మాజీ మేయర్‌ శంకర్‌, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, నాయకుడు రమణారెడ్డిలు వెళ్లి కలెక్టర్‌ పమేలా సత్పతికి పత్రాలను అందజేశారు. దీంతో ఈ స్థానం కోసం శుక్రవారం కేవలం ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలైంది. పెద్దపల్లి స్థానం నుంచి భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణలు తమ నామపత్రాలు రిటర్నింగ్‌ అధికారి ముజమ్మిల్‌ ఖాన్‌కు అందజేశారు. ఈశ్వర్‌ రెండు సెట్ల నామినేషన్లు మాజీ ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌; దుర్గం చిన్నయ్యలతో కలిసి దాఖలు చేశారు. గడ్డం వంశీకృష్ణ ఒక సెట్‌ నామపత్రాలు ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి రిటర్నింగ్‌ అధికారి అందించగా, రెండో సెట్‌ తండ్రి చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌, కుటుంబ సభ్యులతో కలిసి వేశారు. భారాస అభ్యర్థిగా కొంకటి లింగమూర్తి అనే వ్యక్తి కూడా నామినేషన్‌ వేశారు. రెండు రోజులపాటు స్వీకరించిన నామినేషన్లలో కరీంనగర్‌ స్థానం కోసం మూడు, పెద్దపల్లి స్థానం కోసం ఏడు నామినేషన్లు ఇప్పటి వరకు దాఖలయ్యాయి. భారాస కరీంనగర్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ తరపున నాయకులు శనివారం నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. పెద్దపల్లిలో భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ ఈ నెల 22న నామినేషన్‌ వేయనున్నారు. కరీంనగర్‌లో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం విషయంలో ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఖమ్మం స్థానంతోపాటు ఈ స్థానాన్ని శనివారం అధికారికంగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

నిజామాబాద్‌ భారాస అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తున్న బాజిరెడ్డి గోవర్దన్‌.. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ సతీమణి ఆయేషా, జగిత్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత

నిజామాబాద్‌ స్థానానికి ఆరుగురు

నిజామాబాద్‌ కలెక్టరేట్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఆరు నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలు భారాస, భాజపా అభ్యర్థులున్నారు. భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. మొదటి సెట్‌ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్‌.సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తాతో కలిసి రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుకు అందజేశారు. రెండో సెట్‌ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జగిత్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ సతీమణి ఆయేషా ఫాతిమాతో కలిసి వేశారు. భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ పసుపు రైతులతో కలిసి నామపత్రాలు దాఖలు చేశారు. మెడలో పసుపుతో అల్లిన దండ వేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా రాపెల్లి శ్రీనివాస్‌, రాగి అనిల్‌, బహుజన్‌ ముక్తి పార్టీ తరఫున దేవతి శ్రీనివాస్‌, ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్‌ నామినేషన్‌ వేసిన వారిలో ఉన్నారు. నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన రెండు రోజుల్లో ఎనిమిది మంది నామినేషన్లు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని