logo

విధి రాతలో ఎదురీత

కష్టపడుతూ కాలం వెళ్లదీస్తున్న ఆ కుటుంబంపై కాలం కన్నెర్ర చేసింది. సుఖ, సంతోషాలను దూరం చేసింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా వ్యక్తి ఉన్నపలంగా రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

Published : 08 Jun 2023 04:31 IST

ఆదుకోని ఆరోగ్యశ్రీ, అందని ప్రభుత్వ సాయం

కష్టపడుతూ కాలం వెళ్లదీస్తున్న ఆ కుటుంబంపై కాలం కన్నెర్ర చేసింది. సుఖ, సంతోషాలను దూరం చేసింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా వ్యక్తి ఉన్నపలంగా రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బంధువుల సాయంతో రూ.లక్షలు వెచ్చించి వైద్యం అందించారు. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మంచానకే పరిమితమయ్యారు. ఒక్క ప్రమాదం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా చిదిమేసింది. అన్ని రకాల అర్హతలున్నా ఏ ఒక్క సంక్షేమ పథకం ఆ కుటుంబాన్ని ఆదుకోలేకపోయింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కోడుమూరుకు చెందిన రాఘవేంద్రపై న్యూస్‌టుడే ప్రత్యేక కథనం.

 న్యూస్‌టుడే, కోడుమూరు గ్రామీణం

 కోడుమూరు బేపారం వీధిలో ఉంటున్న రాఘవేంద్ర మెకానిక్‌ పని చేస్తుండేవారు. గతేడాది నవంబరులో ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కొత్తూరు సమీపంలో కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించారు. కాళ్లు విరిగిపోయి, చేతులు పని చేయక, శ్వాస తీసుకోలేక తలకు గాయాలై నెల రోజులు కోమాలోనే ఉండిపోయారు. సొంతిల్లు, ఇతర ఆస్తి ఏమీ లేవు. మూడు నెలల తర్వాత నోటి నుంచి తడబడుతూ మాటలు వచ్చాయి. అయినా ఇప్పటికీ మంచానకే పరిమితమయ్యారు. మేనమామల సాయంతో రూ.18 లక్షల వరకు వైద్యసేవలందించారు.

 తల్లి చేరదీసి..

బాడుగ ఇంట్లో ఉంటున్న రాఘవేంద్ర కుటుంబం ప్రమాదం అనంతరం బాడుగ చెల్లించలేక ఇల్లు ఖాళీ చేశారు. అప్పటికే భర్తను ప్రమాదంలో పోగొట్టుకుని దోశలు అమ్ముకొని జీవిస్తున్న తల్లి రామలక్ష్మి కుమారుడి కుటుంబాన్ని చేరదీశారు. రాఘవేంద్ర భార్య సువర్ణ కూలీ పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. వారికి ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్లు, రెండేళ్ల వయస్సున్న ఇద్దరు కుమారులున్నారు. రోజూ కాళ్లు, చేతులు మసాజ్‌ చేస్తున్నామని తల్లి, భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఓ చేయి కొంతమేర సహకరిస్తోందన్నారు. త్వరలోనే కాళ్లకు రాడ్లు వేసి నడిచేలా చేస్తామని వైద్యులు చెప్పారని అన్నారు. ఇప్పటికే అప్పులు ఎక్కువయ్యాయి. కనీసం పింఛను కూడా రావడం లేదన్నారు.

ముఖ్యమంత్రి  సహాయ నిధి కోసం నిరీక్షణ

తీవ్రంగా గాయపడ్డ రాఘవేంద్రను ఆరోగ్యశ్రీ ఆదుకోలేదు. కనీసం ప్రభుత్వ బీమా రాలేదు. నెలకు రెండుసార్లు వైద్యసేవలందించాలి. తల, గుండె, ఫిజియోథెరపీ, కాళ్లకు సంబంధించి నలుగురు వైద్యులు పరీక్షిస్తున్నారు. నెలకు వైద్యం, మందులకే రూ.30 వేలు అవుతోంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తమను ఆదుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌ను ఆశ్రయించగా ఆయన సిఫారసుతో ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ మంజూరు కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని