logo

డబ్బులు ఇవ్వలేదని.. తల్లిని చంపిన తనయుడు

పొలం అమ్మిన డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లినే తనయుడు హత్య చేసిన అమానవీయ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

Published : 03 Feb 2023 03:16 IST

భీరమ్మ

భూత్పూర్‌, న్యూస్‌టుడే : పొలం అమ్మిన డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లినే తనయుడు హత్య చేసిన అమానవీయ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్సై భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. భూత్పూర్‌ మండలం మద్దిగట్లకు చెందిన పువ్వుల భీరమ్మ(55) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెకు కుమార్తె, కుమారుడు భీరయ్య ఉన్నారు. భర్త బాల మాసయ్య చాలా కాలం క్రితమే మరణించాడు. భీరమ్మ రెండేళ్ల కిందట తనకున్న పొలాన్ని విక్రయించగా రూ. 3లక్షలు వచ్చాయి. ఆ డబ్బును అప్పుగా ఇస్తూ వచ్చిన వడ్డీ, కూలి డబ్బులతో జీవనం సాగిస్తోంది. కుమారుడు భీరయ్యకు ఏడాది క్రితం వివాహం కాగా రాజాపూర్‌ మండలంలోని అత్తగారి గ్రామం కూచురులో ఉంటున్నాడు. పొలం డబ్బుల కోసం తరచూ తల్లీకొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చిన భీరయ్య డబ్బుల కోసం తల్లితో మరోసారి గొడవపడ్డాడు. రోకలిబండతో దాడి చేయగా ఆమె మృతిచెందింది. తర్వాత వెళ్లిపోయిన అతడు గురువారం ఉదయం పక్క ఇంటి వాళ్లకు ఫోన్‌ చేసి తన తల్లికి ఇవ్వాలని కోరాడు. ఇంటిపక్కన వాళ్లు వెళ్లి చూసేసరికి భీరమ్మ రక్తపు మడుగులో పడి ఉంది. కుమారుడి దాడి వల్లే భీరమ్మ మృతిచెందిందని, ఆమె సోదరి శ్రీశైలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని