logo

ఏడు పదుల వయసులో ఎంత కష్టం!

ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. అనారోగ్య సమస్యలు, కుమారుడితో గొడవలతో ఇబ్బంది పడుతూ...

Published : 28 Mar 2024 04:16 IST

అనారోగ్యం, కుటుంబ గొడవలతో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం
రైలుకింద పడి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు

గాయాలతో ఉన్న వృద్ధుడిని తరలించడంపై తర్జనభర్జనలో పోలీసులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. అనారోగ్య సమస్యలు, కుమారుడితో గొడవలతో ఇబ్బంది పడుతూ తొలుత పురుగు మందు తాగి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మరుసటి రోజే రైలు కింద తలపెట్టి తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. జోగులాంబ జిల్లా గద్వాలకు చెందిన రాములు (70) ఖైరతాబాద్‌లోని బీజేఆర్‌నగర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు. భార్య, కుమారుడు, కుమార్తె సొంతూరిలో ఉంటున్నారు. కుమారుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా తండ్రి రాములుతో గొడవ పడుతుండేవాడు. దీనికి తోడు అనారోగ్య సమస్యలు వేధించేవి. మంగళవారం కడుపునొప్పి తీవ్రంగా రావడంతో ఇంట్లోనే పురుగు మందు తాగాడు. బస్తీలోని ఇరుగుపొరుగు గుర్తించి 108 ద్వారా ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించటంతో ప్రాణాపాయం తప్పింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఆసుపత్రి నుంచి బయటకొచ్చాక సాయంత్రం ఖైరతాబాద్‌ రైల్వే గేటు సమీపంలో పట్టాల దగ్గరకు వచ్చాడు. ట్రాక్‌ మీదకు వెళ్లే ప్రయత్నం చేయగా గేట్‌మెన్‌ అడ్డుచెప్పడంతో వెనుదిరిగాడు. కొద్దిసేపటికి ఎవరూ చూడకుండా వెళ్లి పట్టాలపై పడుకున్నాడు. ఖైరతాబాద్‌ స్టేషన్‌ వైపు నుంచి నాంపల్లి వెళ్లేందుకు రైలు ఇంజిన్‌ లోక్‌పైలెట్‌ పట్టాలపై వ్యక్తిని గమనించి వేగం తగ్గించాడు. పట్టాల మధ్య పడుకున్న రాములు తలపైకెత్తి చూసే లోపే దగ్గరకు వచ్చి ఇంజిన్‌ తలను బలంగా ఢీకొట్టడంతో పట్టాల మధ్య పడిపోయాడు. ఇంజిన్‌ అతడి మీదుగా వెళ్లిపోయింది. ఇంజిన్‌ ఆపేసిన లోకోపైలెట్‌ రాములు గాయాలతో ఉండటాన్ని గమనించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. కొద్ది నిమిషాల్లోనే ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌ రైల్వే స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నాడు.

గాయాలతో ట్రాక్‌పై వృద్ధుడు, మరో ట్రాక్‌పై వెళ్తున్న రైలు

అరగంటకు పైగా పట్టాలపైనే..

తొలుత రైల్వే పోలీసులు చేరుకున్నా.. వీరిద్దరూ కొత్తగా విధుల్లో చేరినవారు కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల కోసం నిరీక్షించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఖైరతాబాద్‌ పోలీసులు ప్రమాదం రైల్వే ట్రాక్‌పై జరిగినందున తమకు సంబంధం లేదని రైల్వే సిబ్బందికి చెప్పి వెనుదిరిగారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని ఆసుపత్రికి కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తున్నారా అని ఆరా తీయగా ఎవరూ లేకపోవడంతో రైల్వే పోలీసులైనా రావాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం చూస్తూ అక్కడే ఉండిపోయారు. అప్పటికే తీవ్ర గాయాలైన రాములు దాహం వేస్తోంది నీళ్లివ్వాలంటూ వేడుకోవడం కన్నీరు పెట్టించింది. ఇలా దాదాపు అరగంటపాటు రక్తమోడుతూ పట్టాలపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఖైరతాబాద్‌ వైపు నుంచి నాంపల్లికి వెళ్లాల్సిన ఎంఎంటీఎస్‌ రైలు వస్తుండటంతో రైల్వే గేట్‌మెన్‌ అప్రమత్తం చేయగా.. హుటాహుటిన అంబులెన్స్‌లోకి ఎక్కించారు. ఆ తర్వాత మరో 15 నిమిషాలు ఎదురుచూసి, ఉన్నతాధికారుల ఆదేశంతో ఓ కానిస్టేబుల్‌ వెంట వెళ్లారు. ప్రస్తుతం రాములు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రైల్వే పోలీసులు చెప్పారు. కుమారుడు బీజేఆర్‌నగర్‌కు అప్పుడప్పుడు వచ్చేవాడని.. ప్రతిసారీ గొడవ జరగడం.. రాముల్ని కొట్టేవాడని, దీనికితోడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని