logo

గొర్రెల పంపిణీ లేనట్టే

గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు.

Updated : 20 Apr 2024 06:29 IST

డీడీల సొమ్ము వెనక్కి ఇవ్వాలని అధికారుల నిర్ణయం 

మహబూబ్‌నగర్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే : గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు. గతేడాది డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు గొర్రెల పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా చోట్ల గొర్రెల పెంపకందారులు తమకు ప్రభుత్వం వెంటనే యూనిట్లు పంపిణీ చేయాలని లేదా తాము చెల్లించిన డీడీలు అయినా వెనక్కి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. చివరకు స్థానిక అధికారులపై గొర్రెల పెంపకందారుల సంఘాలు, నాయకులు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో అడిగిన వాళ్లందరి డీడీలు వెనక్కి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. భారాస ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. గొర్రెల యూనిట్ల కోసం చాలా మంది దరఖాస్తు చేశారు. ఒక్కో యూనిట్‌ విలువ రూ.1.75 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో లబ్ధిదారు వాటాగా రూ.43,750 చెల్లించాలి. మిగతా మొత్తం ప్రభుత్వం రాయితీ కింద భరించి గొర్రెలు రైతులకు ఇస్తుంది. ఒక్కో యూనిట్‌లో 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి. మొదటి విడత కింద 2018లో ఉమ్మడి జిల్లాలో 67,198 యూనిట్లు పంపిణీ చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 629 కోట్లు ఖర్చు చేసింది. 2019లో రెండో విడతగా 71,354 యూనిట్లు పంపిణీ చేస్తామని ప్రకటించింది. నిధుల కొరతతో ఈ పథకం ముందుకు సాగలేదు. దాదాపు 70వేల మంది గొర్రెల పెంపకందారులు ఒక్కొక్కరు రూ.43,750 చొప్పున ప్రభుత్వానికి డీడీ చెల్లించారు. దాదాపు నాలుగేళ్లవుతున్నా గొర్రెలు పంపిణీ చేయకపోవటంతో డీడీలు చెల్లించిన వాళ్లంతా ఆశలు వదులుకున్నారు. సంబంధిత అధికారులు కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని వేచిచూశారు. రాష్ట్రస్థాయి విజిలెన్స్‌ అధికారులు ఈ పథకం అమలుపై విచారణ చేపట్టడంతో పలు అక్రమాలు బయటపడ్డాయి. ఈ పథకం ఇక కొనసాగే అవకాశాలు లేవని గ్రహించిన జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులు డీడీల సొమ్ము వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. దరఖాస్తుతో బ్యాంకు ఖాతా నకలును జత చేసి ఇవ్వాలని కోరారు. మహబూబ్‌నగర్‌ పశు సంవర్ధక శాఖ అధికారి డా.మధుసుధన్‌గౌడ్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా వివరాలు సమర్పించిన వారికి గురువారం నుంచి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని