logo

బాధ్యత వహిద్దాం.. బాసటగా నిలుద్దాం

కన్నవారికి, స్వగ్రామానికి దూరంగా ఉంటూ.. మాతృభూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే. ప్రజా సంక్షేమానికి నిఘా నేత్రంతో విధులు నిర్వహిస్తారు.

Published : 07 Dec 2022 01:45 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

విరాళాల సేకరణ

కన్నవారికి, స్వగ్రామానికి దూరంగా ఉంటూ.. మాతృభూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే. ప్రజా సంక్షేమానికి నిఘా నేత్రంతో విధులు నిర్వహిస్తారు. శతృసైన్యం మన దేశ భూభాగంలో అడుగు పెట్టకుండా తమ ప్రాణాలు పణంగా పెడతారు. ఇంత చేసిన వారికి చేయూతనివ్వాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి. సైనికులకు, వితంతువులు, వారి కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ నేపథ్యంలో నేడు సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కథనం.

ఏం చేస్తారంటే..

సైనికుల కోసం 1948లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ నిధిని ఏర్పాటుచేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి అధ్యక్షుడిగా, సభ్యులుగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి, ఆర్మీ, నావికా, వాయుసేన దళాల సైన్యాధ్యక్షులు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో సైనిక సంక్షేమ నిధికి అధ్యక్షుడిగా రాష్ట్ర గవర్నర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడిగా, వివిధ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వీరమరణం పొందిన వారితో పాటు సమస్యల్లో ఉన్న వారి కుటుంబీకులకు, క్షతగాత్రులైన సైనికులకు అండగా ఉండేందుకు విరాళాలు సేకరిస్తారు. వాటిని ఆయా కుటుంబాల సభ్యులకు అందజేస్తారు.

ప్రయోజనాలు..రాయితీలు..

మాజీ సైనికులకు ప్రభుత్వం పలు ప్రయోజనాలు కల్పించడంతో పాటు రాయితీలు వర్తింపజేస్తోంది. గ్రూప్‌ 2, గ్రూప్‌ 4లో రిజర్వేషన్లు కల్పించింది. ఇద్దరు కుమార్తెల వివాహానికి రూ.40 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. మాజీ సైనికుడు మరణిస్తే కుటుంబానికి రూ.10 వేలు, భార్య, కుమారుడు, కూతురు మరణించినా అంతే మొత్తం అందజేస్తారు. స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు పావలా వడ్డీపై రుణం ఇస్తారు. ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు. సీఎస్‌డీ క్యాంటీన్‌ ద్వారా వ్యాట్‌ మినహాయింపుపై సరకులు తీసుకోవచ్చు. పిల్లలు బీటెక్‌లో చేరిన మొదటి సంవత్సరంలోనే దరఖాస్తు చేసుకుంటే అబ్బాయిలకు ఏడాదికి రూ.30 వేలు, అమ్మాయిలకు రూ.36వేలు చొప్పున అందిస్తారు.

మాజీ సైనికుల సమస్యలు తెలుసుకుంటున్న మద్రాసు రెజిమెంటల్‌ అధికారులు

చేయూతనివ్వాలి..: ఎన్‌.శ్రీనేష్‌కుమార్‌, ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి

సైనికులు, వారి కుటుంబాలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సంక్షేమ నిధికి విరాళాలు ఇవ్వడం ద్వారా వారికి చేయూతనిద్దాం. వారి సంక్షేమానికి తమ శాఖ తరఫున సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వపరంగా పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని