logo

అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం

మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణఖేడ్‌ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్‌ ఎంపీగా సురేష్‌షెట్కార్‌ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Published : 27 Apr 2024 02:27 IST

శ్రేణుల్లో జోష్‌ నింపిన సీఎం రేవంత్‌రెడ్డి

రేవంత్‌రెడ్డికి గిరిజన సంప్రదాయ కండువా వేస్తున్న మహిళ

పెద్దశంకరంపేట, నారాయణఖేడ్‌, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణఖేడ్‌ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్‌ ఎంపీగా సురేష్‌షెట్కార్‌ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బీహెచ్‌ఈఎల్‌, ఐడీపీఎల్‌, ఈసీఐఎల్‌ వంటి పరిశ్రమలు స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. వీటితో స్థానికంగానే కాకుండా రాష్ట్రం, పొరుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉపాధి లభించిందన్నారు. ఖేడ్‌ నియోజకవర్గంలో రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి ఇస్తే, ఫార్మా కంపెనీల క్లస్టర్‌, విలేజ్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అదే విధ]ంగా నియోజకవర్గంలో మహిళా ఐటీఐని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

సభావేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, మదన్‌మోహన్‌రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు రాములునాయక్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి  

అందుబాటులో ఉండే నేతకు పట్టం కట్టాలి

ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడే సురేష్‌షెట్కార్‌ను ఎంపీగా గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ టికెట్‌ ఆయనకు కేటాయిస్తే,  పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంజీవరెడ్డికి త్యాగం చేశారని కొనియాడారు. సంజీవరెడ్డి అయితేనే విజయం సాధిస్తారని గ్రహించడంతోపాటు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావాలనే సంకల్పంతో షెట్కార్‌ ఈ పని చేశారని పేర్కొన్నారు.

సభకు హాజరైన నాయకులు, అభిమానులు, ప్రజలు

సైడ్‌లైట్స్‌..

  • బహిరంగ సభకు సాయంత్రం 5 గంటల నుంచి కార్యకర్తలు, అభిమానుల రాక మొదలయ్యింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు పడ్డారు.
  • సీఎం పెద్దశంకరంపేటకు సాయంత్రం 6.17 నిమిషాలకు చేరుకోగా హెలిపాడ్‌ వద్ద మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకులు ఘనంగా సన్మానించారు. 6.30కి రోడ్‌షో ప్రారంభించి సభావేదిక వద్దకు రాత్రి 7.05 నిమిషాలకు చేరుకున్నారు. 8 గంటల నుంచి 8.32 వరకు వరకు ప్రసంగించారు.

భారీ జనం చూసి ఉత్సాహం..

కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన జనజాతర సభకు అంచనాలకు మించి కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్‌ నేతలు సమావేశంలో మాట్లాడారు.  సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, లక్ష్మీకాంతరావు, మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, మండవ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ మాట్లాడారు. నారాయణఖేడ్‌, అందోలు, జహీరాబాద్‌ నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు.

ఉత్సాహంగా సాగిన రోడ్‌షో

పెద్దశంకరంపేటలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సీఎం రోడ్‌షో ఉత్సాహంగా సాగింది. హెలిప్యాడ్‌ నుంచి కాన్వాయ్‌ ద్వారా ఉత్తులూరు అండర్‌ బ్రిడ్జి వరకు వచ్చిన సీఎం అనంతరం ఓపెన్‌టాప్‌ వాహనంలో సభావేదిక వరకు రోడ్‌షో నిర్వహించారు. మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సురేష్‌షెట్కార్‌, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, మదన్‌మోహన్‌రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.


హామీలు నెరవేర్చే సత్తా కాంగ్రెస్‌కే ఉంది

మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

దేశంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను 100 రోజుల్లోపే అమలు చేశామని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కులగణన, మహిళకు 50 శాతం రిజర్వేషన్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలకు వేతనాలు పెంపు, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను కాలరాయడానికే భాజపా 400 సీట్లు కోరుకుంటోందని దుయ్యబట్టారు. జారాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌షెట్కార్‌ మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉన్న సమయంలో సోనియాగాంధీని ఒప్పించి, మెప్పించి తెలంగాణ బిల్లు పాస్‌ చేయించడంతో తన పాత్ర ఉందన్నారు. నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే తన నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి దేవుళ్లపై ఒట్టేసి చెబుతున్నా, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ పట్టించుకోవడంలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు