logo

ప్రభుత్వ భూములు మింగేశారు

వింజమూరు మండలంలో వైకాపా నాయకులు, మద్దతుదారులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి అనుభవిస్తున్నారు.

Published : 30 Apr 2024 04:35 IST

బత్తినవారిపల్లి సమీప ప్రభుత్వ భూముల్లో సాగు చేసిన జామాయిల్‌

వింజమూరు, న్యూస్‌టుడే: వింజమూరు మండలంలో వైకాపా నాయకులు, మద్దతుదారులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి అనుభవిస్తున్నారు. అయినా యంత్రాంగం చేష్టలుడిగి వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  •  వింజమూరు పట్టణంలో అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మకై రూ. కోట్ల విలువైన భూములు కబ్జా చేశారు. చుట్టుపక్కల 5 కి.మీ. పరిధిలోని భూముల్లో లేఅవుట్లు వేసి సుమారు వంద కోట్లకు పైగా దోచుకున్నారు. కళ్లెదుటే ఆక్రమణలు కనిపిస్తున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఆక్రమణల విషయమై ఆయా ప్రాంతాలను కావలి ఆర్డీవో శీనానాయక్‌ సిబ్బందితో కలసి గతంలో పరిశీలించారు. ఆక్రమణలు గుర్తించి నివేదిక తయారు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆక్రమణలో ఉన్నట్లు తేలితే వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఆ విషయమై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
  • మండలంలోని పలు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. బుక్కాపురంలో చెరువు లోతట్టు సుమారు 30 ఎకరాలు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. అక్కడ రీసర్వే అనంతరం కూడా ఎలాంటి మార్పు లేదు. కాటేపల్లి పంచాయతీ పరిధిలోని బలిజపాలెం చెరువు లోతట్టు ఏకంగా 200 ఎకరాలు ఆక్రమించారు. ఈ భూమిపై కూడా 145 సెక్షన్‌ అమల్లో ఉంది. కొంత మందిపై కేసులున్నా పట్టించుకోవడం లేదు. మండలంలో అతిపెద్దదయినా చాకలకొండ చెరువు చివరన కూడా ఎక్కువ ఆక్రమణలున్నాయి.

 చర్యలు తీసుకుంటాం

ఎంవీ కృష్ణారెడ్డి, తహసీల్దారు : ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయం నా దృష్టికి వచ్చింది. అసైన్డ్‌ భూముల్లో లేఅవుట్లు వేసిన వారికి నోటీసులు అందగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చట్టపరంగా ముందుకు వెళుతున్నాం. భూములు పరాధీనం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.  కాటేపల్లి తదితర గ్రామాల్లో ఆక్రమణల విషయం నా దృష్టికి రాలేదు. వాటి వివరాలు తెలుసుకుని ప్రభుత్వ స్వాధీనానికి చర్యలు తీసుకుంటా.

  •  కాటేపల్లిలో సుమారు 1277 ఎకరాల భూమి బడా రైతుల చెరలో ఉంది. దీనిపై 145 సెక్షన్‌ ఉన్నా ఇంతవరకు చర్యలు లేవు. భూముల్లో బోర్లు వేసి విద్యుత్తు కనెక్షన్లు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు.
  •  బత్తినవారిపల్లెలో చెరువు లోతట్టు ప్రాంతంలో సుమారు 90 ఎకరాలు ఆక్రమించి జామాయిల్‌, మినుము సాగు చేస్తున్నారు. తక్కెళ్లపాడు రహదారిలోనూ ఆక్రమణలున్నాయి. పైమూడింటితోపాటు గుండెమడకల తదితర గ్రామాల్లో ఎక్కువగా ఆక్రమణలకు పాల్పడ్డారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని