logo

సువిధతో సులభం

ఎన్నికల  ప్రచారానికి సంబంధించి సమావేశం  నిర్వహించాలంటే  ఇది వరకు తెల్ల కాగితంపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు.

Updated : 18 Apr 2024 06:24 IST

48 గంటల్లోనే ప్రచార అనుమతులు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

ఎన్నికల  ప్రచారానికి సంబంధించి సమావేశం  నిర్వహించాలంటే  ఇది వరకు తెల్ల కాగితంపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు. ఇది తలనొప్పిగా ఉండేది. ఇప్పుడు చాలా సులువుగా మారింది. ఇందుకు ఎన్నికల సంఘం ‘సువిధ’ యాప్‌ ప్రవేశపెట్టింది. అనుమతుల జారీకి అధికారుల వద్దకు వెళ్లాల్సిన పని లేదు. యాప్‌లో దరఖాస్తు చేస్తే అనుమతులు జారీ చేస్తారు.

పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి నామపత్రాల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం జోరుగా సాగనుంది. ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలపై దృష్టి సారించనున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటారు. ర్యాలీలతో హోరెత్తిస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ఎన్నికల సంఘం ప్రచార పర్వంలో నిబంధనలు విధించింది. అభ్యర్థులు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించాలన్నా.. ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇందుకు సువిధ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఇలా చేయాలి

  • తమ చరవాణిలో గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా సువిధ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • సమావేశం నిర్వహించే వివరాలతో పాటు తమకు ఏ విధమైన అనుమతులు కావాలో అందులో నమోదు చేయాలి.
  • అనుమతులకు సంబంధించి మీ-సేవ కేంద్రంలో చలనా చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన చలానా రసీదు, సువిధలో నమోదు చేసిన వివరాలు రిటర్నింగ్‌ అధికారి, అసెంబ్లీ పరిధిలోని ఏఆర్వో కార్యాలయాల్లో అందజేయాలి.
  • ఎలాంటి జాప్యం లేకుండా దరఖాస్తులు ఎన్నికల అధికారులకు చేరిన 48 గంటల్లోనే అనుమతులు జారీ చేస్తారు.
  • అనుమతి జారీలో జాప్యం జరిగితే సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు.

పార్లమెంటు పరిధిలో కలెక్టర్‌

నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక పార్టీకి చెందిన ప్రచార వాహనం పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తిరగాల్సి వస్తే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించే కలెక్టర్‌ అనుమతిస్తారు. ప్రధాన నాయకులు హెలిక్యాప్టర్లలో వస్తే దీని అనుమతి ఆయన వద్దే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా సువిధ ద్వారానే దరఖాస్తు చేసుకుంటే అనుమతి జారీ చేస్తారు.

అసెంబ్లీ పరిధిలో ఏఆర్వోలు

పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారానికి ఏఆర్వోలు అనుమతులు జారీ చేస్తారు. నియోజకవకర్గ పరిధిలో వాహనాలు, ప్రజలతో కలిసి ర్యాలీలు, సభా నిర్వహణ, సమావేశాలు, తాత్కాలిక ఎన్నికల కార్యాలయాల ఏర్పాటు, లౌడ్‌ స్పీకర్లు, జెండాలు, పోస్టర్ల వినియోగం, ఇంటింటి ప్రచారానికి.. ఏదైనా అనుమతి పొందాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని